దండం పిండం – SKN పంచులు

స్టేజి ఎక్కడైనా సందర్భం ఎప్పుడైనా నిర్మాత ఎస్కెఎన్ స్పీచులు ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రాసలతో కూడిన పంచులు వేయడంలో ఇతని స్పెషాలిటీ వేరు. మెగాస్టార్ చిరంజీవినే ఇలాంటి కౌంటర్లతో మెప్పించడం తనకే చెల్లింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్వహించిన టిడిపి జనసేన బిజెపి కూటమి విజయోత్సవ వేడుకలో మరోసారి తనదైన బాణీలో చెలరేగిపోయారు. అప్పట్లో అన్నయ్య దండం పెడితే ఇప్పుడు తమ్ముడు పిండం పెట్టాడంటూ వేసిన చమక్కు ఓ రేంజ్ లో పేలింది. సంస్కారం చేతకాని వాళ్లకు ప్రజలు ఇలాంటి తిరస్కారం ఇస్తారని వైసిపిని ఉద్దేశించి అన్నారు.

ఈ దండం పిండం వెనుక ఫ్లాష్ బ్యాక్ తెలిసిందేగా. మాజీ సీఎం జగన్ పాలనలో టాలీవుడ్ పెద్దలంతా తాడేపల్లిగూడెం వెళ్లి విన్నపాలు చేసినప్పుడు చిరంజీవి చేతులెత్తి దండం పెట్టి మరీ తమ సమస్యలని పరిగణించమని కోరారు. దాని జగన్ నవ్వుతూ తలూపారు తప్పించి అలా చేయకండి మీరు పెద్దవారు అనే మాట అనలేదు. పైగా లోపల రూమ్ లో జరిగిన సమావేశం వీడియోని ఉద్దేశపూర్వకంగా బయటికి వదిలారని ఫ్యాన్స్ భగ్గుమన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులు ఎన్నికల ప్రచారంలో ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ దీనికి బదులు ఉంటుందని కూడా అన్నారు.

ఇదంతా దృష్టిలో ఉంచుకునే ఎస్కెఎన్ తన ప్రసంగంలో ఎలివేషన్లు ఇచ్చారు. జనసేన కోసం పిఠాపురంలో విస్తృతంగా పని చేసిన ఎస్కెఎన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రాజకీయంగా ఎదురయ్యే కామెంట్లకు, ట్రోల్స్ కు సైతం సమాధానం ఇచ్చేవారు. ఓడిపోయిన గత అధికార పక్షాన్ని ఇంత పబ్లిక్ గా ఓపెన్ గా ఇలా కామెంట్ చేసిన సందర్భాలు టాలీవుడ్ లో తక్కువే. అదేంటో కానీ కూటమి అధికారంలోకి రాగానే అందరికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. పైగా టాలీవుడ్ కు ఇకపై జరిగేదంతా శుభమే అనే రీతిలో ఒకరకమైన ఆనందకర వాతావరణం ఇండస్ట్రీలో కనిపిస్తోంది.