వరుణ్ సందేశ్ ‘నింద’ ఎలా ఉంది

వచ్చే వారం కల్కి 2898 ఏడి విడుదల నేపథ్యంలో ఇవాళ చిన్న సినిమాలు మూకుమ్మడిగా ఒకేసారి దాడి చేశాయి. అలా అని థియేటర్లు జనాలతో కళకళలాడి పోవడం లేదు. దాదాపుగా అన్నింటికి అత్తెసరు ఓపెనింగ్స్ కనిపించాయి. టాక్ వస్తే అప్పుడు చూద్దాంలే అని పరిమిత వర్గం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వాటిలో నింద ఒకటి. ఎప్పుడో కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ లాంటి సూపర్ హిట్స్ తో కెరీర్ ప్రారంభంలో జోష్ చూపించిన వరుణ్ సందేశ్ భారీ గ్యాప్ తరువాత సోలో హీరోగా చేసిన మూవీకి అంతో ఇంతో బజ్ వచ్చింది దీనికే. మరి నింద ఈ ఒకప్పటి యూత్ హీరోకు కోరుకున్న బ్రేక్ ఇచ్చిందా.

కండ్రకోటలో మంజు అనే అమ్మాయి అత్యాచారానికి బలై చనిపోతుంది. కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న బాలరాజు (ఛత్రపతి శివాజీ) కి సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉండటంతో జడ్జ్ సత్యానంద్ (తనికెళ్ళ భరణి) అతనికి ఉరి శిక్ష విధిస్తాడు. అయితే తను తప్పుడు తీర్పు ఇచ్చానని మధనపడుతూ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పని చేసే కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) కు జరిగిందంతా వివరిస్తాడు. చనిపోయిన తన తండ్రి ఆఖరి కోరిక తీర్చేందుకు వివేక్ స్వయంగా రంగంలోకి దిగి నేరస్తుడెవరో వెలికి తీసే బాధ్యత తీసుకుంటాడు. తవ్వేకొద్దీ విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. అవేంటనేది నింద అసలు కథ.

దర్శకుడు రాజేష్ జగన్నాథం తీసుకున్న దోషి నిర్దోషి పాయింట్లో కొంత వైవిధ్యం ఉన్నప్పటికీ కథనాన్ని రెగ్యులర్ ఫార్మాట్ లో రాసుకోవడం వల్ల నింద మాములుగా అనిపిస్తుంది. బలంగా ఉండాల్సిన సన్నివేశాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోవడంతో ఇంటెన్సిటీతో పండాల్సిన స్థాయిలో ట్విస్టులు కుదరలేదు. ఎమోషన్ డోస్ బాగా ఎక్కువయ్యింది. ఈ మోతాదు తగ్గించాల్సింది. వరుణ్ తేజ్ తో పాటు ఇతర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు తమ పరిధి వరకు బాగానే చేసినప్పటికీ క్రైమ్ థ్రిల్లర్లతో నిండిపోయిన ఓటిటి ట్రెండ్ లో ఇలాంటి క్యాస్టింగ్ లేని నిందలు థియేటర్ జనాలతో నెట్టుకురావడం కష్టమే.