నితిన్ చైతులకు డిసెంబర్ గండం

ఎప్పుడో ఆరేడు నెలల తర్వాత రిలీజ్ డేట్లు లాక్ చేసుకున్నా ఎలాంటి పోటీ, సమస్య రాదనే గ్యారెంటీ లేని పరిస్థితులు ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొన్నాయి. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలకు ఇదో ప్రాణ సంకటంగా మారింది.

గత ఏడాది సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ హఠాత్తుగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కు వెళ్లిపోవడం ఎన్ని సినిమాలను ప్రభావితం చేసిందో అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. కొన్నింటి ఓపెనింగ్స్ దెబ్బ తింటే మరికొన్ని టైమింగ్ మిస్సయిపోయి ఫ్లాపులు చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడిదే సిచువేషన్ 2024 డిసెంబర్ లోనూ రిపీటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ముందు ప్రకటించిన దాని ప్రకారం డిసెంబర్ 20న నాగ చైతన్య తండేల్, నితిన్ రాబిన్ హుడ్ అధికారికంగా రావాలి. పోటీ అయినప్పటికీ రెండు వేర్వేరు జానర్లు కాబట్టి ఆయా దర్శక నిర్మాతలు ఓకే అనుకున్నారు.

ఇప్పుడు చూస్తే ఆగస్ట్ నుంచి తప్పుకోబోతున్న పుష్ప 2 ది రూల్ ని మొదటి భాగంలాగే డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్ ఉన్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఒకవేళ నిజంగా అనుకుంటే తండేల్ నిర్మాత గీతా ఆర్ట్స్ కాబట్టి సులభంగా తప్పుకుంటుంది. రాబిన్ హుద్ నిర్మాతలు మైత్రి వాళ్లే కనక నితిన్ మూవీని ఇంకో తేదీకి మార్చేస్తారు.

అప్పుడు తండేల్, రాబిన్ హుడ్ ముందే రావడమో లేక వచ్చే సంవత్సరానికి షిఫ్ట్ అవ్వడమో చేయాలి. ఒకవేళ పుష్ప కనక అక్టోబర్ ఆప్షన్ చూస్తే గండం తప్పిపోయిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ని అక్టోబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేసే దిశగా నిర్మాత దిల్ రాజు దర్శకుడు శంకర్ తో మాట్లాడి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట.

ఎలా చూసుకున్నా అల్లు అర్జున్, రామ్ చరణ్ ఎవరో ఒకరు ఏడాది చివర్లో వచ్చేలా ఉన్నారు. రాను రాను ప్యాన్ ఇండియా సినిమా తేదీలు అనిశ్చితికి మారుపేరుగా నిలుస్తున్నాయి. ఇదో అంతులేని కథగా మారిపోతోంది.