ఇంట్రెస్టింగ్.. ప్రభాస్ సినిమాకు మెంటార్‌గా ఆ లెజెండ్

ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’లో నటిస్తున్న ప్రభాస్.. దీని తర్వాత రెండు భారీ ప్రాజెక్టులు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఒక సినిమాను లేటుగా అనౌన్స్ చేసినప్పటికీ.. ముందు మొదలయ్యేది అదే అనిపిస్తోంది. ఆ చిత్రమే.. ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు.

ఇక ‘మహానటి’తో గొప్ప పేరు సంపాదించిన మన తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ ఓ భారీ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ నిర్మించబోయే ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్లో తెరకెక్కబోయేదే. ఇది ఫాంటసీ మిక్స్ అయిన సైన్స్ ఫిక్షన్ మూవీ అని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం మరింత ఊపందుకునేలా ఈ ప్రాజెక్టులోకి లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావును తీసుకురావడం విశేషం.

సోమవారం సింగీతం 89వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. తమ సినిమాలో ఆయన భాగమవుతున్నట్లుగా ప్రభాస్-నాగ్ అశ్విన్ చిత్ర బృందం ఒక ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసింది. తమ చిత్రానికి సింగీతం మెంటార్‌గా పని చేయబోతున్నట్లు వెల్లడించింది. దక్షిణాదిన సింగీతం చేసినన్ని ప్రయోగాలు మరే దర్శకుడూ చేసి ఉండడంటే ఆశ్చర్యం లేదు. అందరూ ఒక మూసలో కొట్టుకుపోతున్న సమయంలో పుష్పక విమానం, అపూర్వ సహోదరులు, ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి వినూత్న చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారాయన.

ఇప్పుడు ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రాబోయే సినిమా ‘ఆదిత్య 369’ లైన్లో ఉంటుందన్న ఊహాగానాలు వినిపించగా.. సింగీతంను దీనికి మెంటార్‌గా తీసుకోవడంతో అది నిజమే అనిపిస్తోంది. సింగీతం ఈ ప్రాజెక్టులోకి వచ్చి ఏం సలహాలిస్తాడన్నది పక్కన పెడితే.. ఆ దిగ్గజాన్ని వైజయంతీ మూవీస్ వాళ్లు గౌరవిస్తున్న తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇదిలా ఉండగా.. సింగీతం ఈ నెల 9న కరోనా పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ కోలుకుంటున్నారు.