కుర్ర జంట మధ్య ‘మనమే’ అల్లరి

Sharwanand

ఒకే ఒక జీవితం సక్సెస్ తర్వాత శర్వానంద్ కు కొంత గ్యాప్ వచ్చింది. అనుకుని చేసింది కాకపోయినా అభిమానులు కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ 7 రిలీజ్ కాబోతున్న మనమే మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎన్నికల ఫలితాల తర్వాత రిలీజవుతున్న మొదటి స్టార్ హీరో మూవీ. ఇవాళ హైదరాబాద్ ఏఏఏ మల్టీప్లెక్స్ లో ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. రామ్ చరణ్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు ఆన్ లైన్ వెర్షన్ వచ్చింది.

క్లుప్తంగా కథ చెప్పారు. ఒక అందమైన జంట (శర్వానంద్ – కృతి శెట్టి). ఇద్దరి ఆలోచనలు వేరైనా కలిసి ప్రయాణం చేసే రోజొస్తుంది. మధ్యలో ముద్దులొలికే ఒక బుల్లి బాబు(మాస్టర్ విక్రమ్ ఆదిత్య). విదేశాలకు వెళ్లే క్రమంలో ఈ ఇద్దరి మధ్య వీడు ఎలా వచ్చాడనేది సస్పెన్స్. ఇక్కడి నుంచి అసలు స్టోరీ షురూ. పిల్లల్ని పెంచడంలో అవగాహన లేని ఇతను నానా ఇబ్బందులు పడుతుంటాడు. అమ్మాయేమో ఈ వ్వవహారమంతా చూసి తిడుతూ ఉంటుంది. అసలు వీళ్ళ లవ్ స్టోరీ మధ్యలో ఆ బుడతడు ఎలా వచ్చాడు, ప్రేమలో ఎలాంటి చిక్కులు ఎదురుకున్నారనేదే తెరమీద చూడమంటున్నారు.

శర్వా కృతిలు క్యూట్ గా ఉండగా చైల్డ్ కామెడీతో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కొత్తగా ప్రయోగం చేసినట్టు కనిపిస్తోంది. సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సచిన్ కెడ్కర్, రాహుల్ రవీంద్రన్, సుదర్శన్ తదితరులతో పెద్ద క్యాస్టింగే పెట్టుకున్నారు. హేశం అబ్దుల్ వహాబ్ నేపధ్య సంగీతం మరోసారి ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తోంది. కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకున్న మనం టైటిల్ కు తగ్గట్టే ఎంటర్ టైన్ చేయడమే కాన్సెప్ట్ గా తీసుకుంది. వచ్చే శుక్రవారం కాజల్ అగర్వాల్ సత్యభామ, నవదీప్ లవ్ మౌళితో పోటీ పడనున్న మనమే మంచి క్లాస్ కంటెంట్ తో వస్తున్న హామీ అయితే ఇచ్చింది