క్రికెట్ వీడియోపై ట్రోలింగ్.. జాన్వి హర్టు

సినీ తారలు తాము తెరపై పోషించే కొన్ని పాత్రల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. ముఖ్యంగా సినిమాల్లో క్రీడాకారులుగా కనిపించినపుడు.. సంబంధిత ఆటలో శిక్షణ తప్పనిసరి. లేదంటే ఆ పాత్ర అభాసుపాలవుతుంది.

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వి కపూర్ తన కొత్త చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’లో క్రికెటర్ పాత్ర చేసింది. నిజంగా క్రికెటర్ తరహాలో కనిపించేందుకు ఆమె ట్రైనింగ్ తీసుకుంది. సంబంధిత వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఐతే ఆ వీడియోలో ఆమె క్రికెట్ ఓనమాలు దిద్దుకున్న దశ నుంచి.. ప్రొఫెషనల్ క్రికెటర్ తరహాలో షాట్లు ఆడే క్రమాన్ని చూపించారు. ఐతే ఈ వీడియో మరీ అతిగా ఉందని.. నాటకీయత ఎక్కువైందని జాన్విని నెటిజన్లు కొందరు ట్రోల్ చేశారు. ఇందుకు జాన్వి హర్టయింది.

వీడియోలో జాన్వి టెన్నిస్ బంతితో సాధన సాగించినట్లు చూపించారు. కానీ ఒంటికి గట్టిగా దెబ్బలు తగిలినట్లు చూపించడంతో ట్రోలింగ్ తప్పలేదు. ఐతే ట్రోలింగ్ కొంచెం శ్రుతి మించడంతో జాన్వి హర్టయింది. ట్రోలర్స్‌కు బదులిస్తూ కామెంట్ పెట్టింది. “ముందు క్రికెట్ బాల్‌తోనే సాధన చేశాను. అప్పుడే దెబ్బలు తగిలాయి. నా భుజాలకు ఉన్న బ్యాండేజీలను చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది. దెబ్బలు తగిలిన తర్వాత ఆడిన వీడియోనే ఇది. ట్రోల్ చేసే ముందు పూర్తి వీడియో చూడండి. అప్పుడు నేను కూడా మీరు వేసే జోక్‌లకు నవ్వుతాను” అని జాన్వి పేర్కొంది.

జాన్వి సరసన రాజ్ కుమార్ రావు నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి రివ్యూలు, మౌత్ టాక్ బాగానే ఉన్నాయి.