సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్లే చరణ్ ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ ఎప్పుడు విడుదలవుతుందో ఇంకా ఖరారు కాలేదు కానీ షూటింగ్ మొదలై నాలుగో సంవత్సరం గడుస్తున్నా అభిమానులు ఓపికగా ఎదురు చూస్తున్నారు.

దేని వల్ల అయితే ఇంత ఆలస్యం అయ్యిందో ఆ భారతీయుడు 2 జూలై 12 విడుదలకు సిద్ధం కావడంతో మెగా ఫ్యాన్స్ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది కనీసం ఓ రెండు మూడు వారాలు రన్ అయ్యాక కానీ చరణ్ మూవీ గురించి క్లారిటీ రాదు. ఇకపోతే దీనికి సంబంధించిన కొన్ని లీకులు మంచి ఆసక్తి రేపెలా ఉండటంతో అంచనాలు పెరుగుతున్నాయి.

ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్న ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచాక కూడా సామాన్యుడికి ప్రతీకగా సైకిల్ మీదే అసెంబ్లీకి వస్తాడట. ఇదేమి తెలుగుదేశం గుర్తుని ప్రతిబింబించే తరహాలో పెట్టనప్పటికీ కథ అందించిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ వాహనం చుట్టూ ఒక కీలకమైన మలుపు పెట్టడం వల్ల అభిమానులు షాక్ తో కూడిన థ్రిల్ ఫీలవుతారని అంటున్నారు. ఒకప్పుడు నిరాడంబరతకు మారుపేరుగా ఉన్న పొలిటీషియన్లను ఆధారంగా చేసుకుని ఆపన్న పాత్రని తీర్చిదిద్దినట్టు అంతర్గత సమాచారం.

అప్పన్నకు భార్యగా అంజలి నటిస్తోంది. ఒక ఎమోషనల్ సాంగ్ కూడా ఉంటుంది. దీని గురించి ఏం మాట్లాడనివ్వకుండా నోరు కుట్టేసిన పరిస్థితుల్లో ఉన్నానని గ్యాంగ్స్ అఫ్ గోదావరి ప్రమోషన్లలో చెప్పిన సంగతి తెలిసిందే. సో చాలా స్పెషల్ గా ఉండబోతోన్న క్లూ అయితే వచ్చేసింది. తమన్ సంగీతం సమకూర్చిన గేమ్ ఛేంజర్ లో శ్రీకాంత్, ఎస్జెసూర్య, సునీల్, జయరాం ఇతర తారాగణం కాగా భరత్ అనే నేను, వినయ విధేయ రామ తర్వాత హీరోయిన్ కియారా అద్వానీ ఒప్పుకున్న టాలీవుడ్ మూవీ ఇదే. సినిమా విడుదలకు అక్టోబర్ లేదా డిసెంబర్ రెండు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు.