సిరివెన్నెలకు రాజమౌళి కోపం తెప్పించిన వేళ  

దర్శక ధీర రాజమౌళిని కుటుంబ సభ్యులు కోపగించుకోవడంలో పెద్దగా ఆశ్చర్యపడ్డానికి ఏమి లేదు కానీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇతర వ్యక్తి ఆగ్రహం చేయడం వ్యక్తం చేయడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇది స్వయానా జక్కన్న పంచుకోవడంతో విషయం ప్రపంచానికి తెలిసింది. గీత రచయిత స్వర్గీయ సీతారామశాస్త్రికి నివాళిగా ఒక ఛానల్ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ షో తొలి ఎపిసోడ్లకు రాజమౌళి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ తమ జీవితాలపై సిరివెన్నెల రాసిన పాటలు ఎలాంటి ప్రభావం చూపాయో చెప్పుకొచ్చారు.

కొన్నేళ్ల క్రితం పద్మశ్రీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు తీసుకోవడానికి రాజమౌళికి మనసొప్పలేదు. కారణాలు ఏమైనా అది నలుగురికి ఎలా చెప్పాలన్న అంతర్మధనం మొదలయ్యింది.. అదే సమయంలో సీతారామశాస్త్రి గారు ఫోన్ చేశారు. మాటల ప్రస్తావనలో ఇలా పద్మశ్రీ తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లడం లేదని రాజమౌళి చెప్పడంతో ఒక్కసారిగా అటుపక్క గురువుగారికి కోపం వచ్చింది. నీకు అర్హత ఉందని గవర్నమెంట్ గుర్తించి పురస్కారం ఇస్తుంది, ఎక్కువ ఆలోచించకుండా నోరు మూసుకుని వెళ్లి తీసుకునిరా అని హుకుం జారీ చేయడంతో రాజమౌళి ఇచ్చిన డేటుకి ఢిల్లీ వెళ్లి పద్మశ్రీ అందుకున్నారు.

ఒకవేళ సిరివెన్నెల వారు ఫోన్ చేయకపోతే రాజమౌళి పద్మశ్రీ తీసుకునేవారు కాదేమో. అంత ఘాడమైన గురు శిష్య అనుబంధం ఉంది కాబట్టే సింహాద్రి నుంచి ఆర్ఆర్ఆర్ దాకా ఖచ్చితంగా తన సినిమాలో ఆయన పాట ఉండేలా చూసుకునేవారు. మర్యాదరామన్నలో పరుగులు తీయ్ తనకు బాగా ఇష్టమైన పాటగా పేర్కొన్నారు. అర్ధాంగి ఫ్లాప్ అయిన సమయంలో తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి గీతం స్ఫూర్తి ఇవ్వడం వల్లే తిరిగి ఆయన కలానికి బలం పెట్టి బ్లాక్ బస్టర్లలో భాగమై ఇప్పటికీ రచనా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నానని చెప్పారు. ఇదన్నమాట రాజమౌళిని తిట్టిన శాస్త్రిగారి కథ.