ట్రోల్స్‌కు బాధపడ్డా-మంచు లక్ష్మి

టాలీవుడ్లో విపరీతంగా ట్రోల్స్ ఎదుర్కొనే కుటుంబాల్లో మంచు వారిది ముందుంటుందన్నది వాస్తవం. ముఖ్యంగా మంచు లక్ష్మి కెరీర్ ట్రోల్స్‌తోనే మొదలైంది. అమెరికాలో చాలా ఏళ్లు ఉండి వచ్చిన లక్ష్మి.. అక్కడి యాక్సెంట్‌తో మాట్లాడ్డం మీద చాలాసార్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంది.

అంతే కాక సినిమాల్లో లక్ష్మి పాత్రలు, నటన విషయంలోనూ ట్రోల్స్ తప్పలేదు. ఐతే తాను ఎంత స్పోర్టివ్ అయినప్పటికీ.. ట్రోల్స్ చూసి గతంలో బాధ పడేదాన్నని లక్ష్మి తెలిపింది.

“నేను ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని. మీ బిడ్డని. మొదట్నుంచి ముక్కుసూటిగా మాట్లాడే తత్వం నాది. కొందరు నన్ను అదే పనిగా ట్రోల్స్ చేయడం చూసి బాధవేసేది. నాకు పొలిటికల్లీ కరెక్ట్‌గా మాట్లాడ్డం రాదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా. అది కొందరికి నచ్చుతుంది. కొందరికి నచ్చదు. ఎవరో కావాలని నన్ను ట్రోల్స్ చేస్తారని భావించను. కానీ మొదట్లో ట్రోల్స్ చూసి బాధ పడ్డ నేను తర్వాత వాటికి అలవాటు పడిపోయాను’’ అని తాను నటించిన ‘యక్షిణి’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో లక్ష్మి తెలిపింది.

ఇక తమ కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునన ‘కన్నప్ప’ సినిమాలో తాను నటించడం లేదని స్పష్టం చేసిన లక్ష్మి.. అందులో తన తమ్ముడు మనోజ్ కూడా లేడని తెలిపింది.

‘కన్నప్ప’లో తాను ఎందుకు లేనని చాలామంది అడిగారని… కానీ తనకు సరిపోయే పాత్ర లేదు కాబట్టే అందులో నటించట్లేదని భావిస్తున్నట్లు తెలిపింది. తాను, మనోజ్ కూడా ఉంటే అది తమ ఫ్యామిలీ సినిమా అయిపోతుందని.. అలా ఉండొద్దనే భావిస్తున్నానని లక్ష్మి తెలిపింది.