బెనిఫిట్ షోల రద్దు లాభమా నష్టమా

ఇటీవలే తెలంగాణ సింగల్ స్క్రీన్లను కాపాడుకునే ఉద్దేశంతో పర్సెంటేజీ విధానంలో తీసుకొచ్చిన మార్పుల గురించి ట్రేడ్ లో పెద్ద చర్చే జరుగుతోంది. దీని వల్ల ఎగ్జిబిటర్లకు మేలు జరుగుతుంది తప్ప చిన్న సినిమాలు తీసే నిర్మాతలకు కాదనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

మల్టీప్లెక్సులకు అమలు చేస్తున్న విధానమే అందరికీ వర్తింపజేస్తే బాగుంటుందనే అభిప్రాయం థియేటర్ ఓనర్లలో వ్యక్తమవుతోంది. అద్దెల విధానం వల్ల తమకు ఒరుగుతున్నది ఏమి లేదని, స్థలం విలువపై రావాల్సిన ఆదాయంలో కనీసం సగం కూడా రాబట్టుకోలేపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదంతా ఒక వ్యవస్థీకృత విధానంలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో జూలై 1 వరకు గడువు ఇస్తూ నైజాం ఎగ్జి బిటర్లు మార్పు కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇకపై బెనిఫిట్, స్పెషల్, మిడ్ నైట్ షోలు వేయమని కూడా తెగేసి చెబుతున్నారు. ఇక్కడే స్టార్ హీరోల అభిమానుల మనసులు చివుక్కుమంటున్నాయి.

టాక్ తో సంబంధం లేకుండా ఒక పెద్ద హీరో సినిమాకు స్పెషల్ షోలు వేయడం వల్ల వచ్చే రెవిన్యూ కోట్లలో ఉంటుంది. ఉదాహరణలో ఒక పెద్ద సింగల్ స్క్రీన్ అద్దె షోకు 90 వేలు అనుకుంటే టికెట్ రేట్లు ఎక్కువకు లేదా బ్లాక్ లో అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం కనీసం నాలుగైదు లక్షలు ఉంటుంది.

ఇందులో షో కొన్న థర్డ్ పార్టీ లేదా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ లాభపడతారు తప్ప ఎగ్జిబిటర్ కాదు. పైగా ఫ్యాన్స్ చేసే గోల, అల్లరి వల్ల ఆస్తి నష్టాలు జరిగే సందర్భాలు ఉంటాయి. పదుల కోట్ల విలువ చేసే చోట థియేటర్లు నిర్వహిస్తూ కేవలం వేలు, లక్షలు ఆదాయం చూడటం తమ మనుగడని ప్రశ్నిస్తోందని అంటున్నారు.

ఏది ఏమైనా బెనిఫిట్ షోలు తీసేస్తే మాత్రం ఓపెనింగ్ ఫిగర్ల మీద పెద్ద ప్రభావం ఉంటుంది. ఉద్యోగాలు చేసుకునే సినీ ప్రియులు తెల్లవారుఝామున ప్రీమియర్లకు వెళ్లే కౌంట్ కొన్ని లక్షల్లో ఉంటుంది. ఇది గణనీయంగా తగ్గిపోతుంది. చూడాలి ఎలాంటి నిర్ణయాలు అమల్లోకి వస్తాయో.