జాన్వీకి చుక్కలు చూపించిన క్రికెట్

ఒకేసారి ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన రెండు వేర్వేరు ప్యాన్ ఇండియా సినిమాలతో గ్రాండ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ రాబోయే బాలీవుడ్ చిత్రాల మీదా మనవాళ్లకు క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. వాటిలో ఈ నెలాఖరు మే 31 విడుదల కాబోతున్న మిస్టర్ అండ్ మిసెస్ మహీ మీద చాలా ఆశలు పెట్టుకుంది. రాజ్ కుమార్ రావు హీరోగా శరణ్ శర్మ దర్శకత్వంలో రూపొందింది. క్రికెటర్ గా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైన హీరో ఆ గోల్ ని డాక్టరైన తన భార్య ద్వారా నెరవేర్చుకోవడమనే డిఫరెంట్ పాయింట్ మీద తీశారు.

మాములుగా లేడీ క్రికెటర్ల మీద వచ్చిన సినిమాలు తక్కువ. ఆ మధ్య తాప్సి చేసింది కానీ ఆడలేదు. ఇప్పుడీ మిస్టర్ అండ్ మిసెస్ మహీ కోసం జాన్వీ కపూర్ నిజంగానే రెండేళ్లు కఠినంగా ఆటను ప్రాక్టీస్ చేసింది. తీవ్ర గాయాలు కలిగి ఒకదశలో ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేద్దాం అనుకునే స్టేజి దాకా ఎన్నో కష్టాలు చవి చూసింది. అయినా సరే సహజత్వం కోసం విఎఫెక్స్ అవసరం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు కోచ్ ల సహాయంతో ఆటను పూర్తిగా నేర్చుకుంది. రిలీజయ్యాక సినిమా హిట్ అయితే పూర్తి క్రెడిట్స్ తనకే వస్తాయని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఈ కబుర్లన్నీ చెప్పింది.

బాలీవుడ్ లో ఎక్కువ కాన్సెప్ట్ ఆధారంగా నడిచే చిత్రాలను ఎంచుకుంటున్న జాన్వీ కపూర్ సౌత్ లో మాత్రం స్టార్ హీరోల సరసన ఆఫర్లు వస్తే వదలను అంటోంది. కెరీర్ పరంగా రెండు భాషల్లో భిన్న ధృవాల్లో వెళ్తోంది. అక్టోబర్ 10 దేవర రిలీజ్ అయ్యాక అందులో పోషించిన తంగం పాత్ర తనకెంతో పేరు తెస్తుందని ఎదురు చూస్తోంది. బెస్తవారి అమ్మాయిగా లుక్స్ తో పాటు పెర్ఫార్మన్స్ ప్రత్యేకంగా ఉంటాయట. రామ్ చరణ్ 16లో బుచ్చిబాబు డిజైన్ చేసిన పాత్ర కూడా ఇంతే ఛాలెంజింగ్ గా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. రాబోయే అయిదు నెలల్లో జాన్వీ కపూర్ మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి.