‘పుష్ప’తో నాకొచ్చిందేమీ లేదు-ఫాహద్


మలయాళంలో గత దశాబ్ద కాలంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన నటుడు ఫాహద్ ఫాజిల్. లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫాహద్ మొదట్లో నటుడిగా పరిచయం అయినపుడు మామూలుగానే అనిపించాడు. కానీ కొన్నేళ్ల తర్వాత అతడి పాత్రలు, పెర్ఫామెన్స్‌లు చూసి జనాలు ఫిదా అయిపోయారు. ఒక ఇమేజ్‌కు కట్టుబడకుండా సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ.. అన్ని రకాల పాత్రలూ చేస్తూ అద్భుతమైన నటనతో కట్టిపడేశాడు ఫాహద్.

‘కుంబలంగి నైట్’, ‘జోజి’ లాంటి చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల గురించైతే ఎంత చెప్పినా తక్కువే. నెమ్మదిగా అతడి పేరు కేరళను దాటి వినిపించడమూ మొదలైంది. ‘పుష్ప’ సినిమా చివర్లో కేవలం 20 నిమిషాలు కనిపించే విలన్ పాత్రతో అతను వేసిన ముద్ర చాలా బలమైంది. ‘పార్టీ లేదా పుష్ప’ అనే డైలాగ్ మామూలుగా పాపులర్ కాలేదు.

ఐతే తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన ‘పుష్ప’ విషయంలో ఫాహద్ ఫాజిల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఫాహద్ చేసిన కామెంట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘పుష్ప’ వల్ల తనకు కొత్తగా క్రేజ్ ఏమీ రాలేదని అతనే తేల్చేశాడు. కేరళను దాటి మిగతా ప్రాంతాల్లో ‘పుష్ప’ వల్ల మీకు ఎక్కువ క్రేజ్ వచ్చిందా అని అడిగితే.. లేదు అని సమాధానం ఇచ్చాడు ఫాహద్. అలా అని తాను ఎవరినీ తప్పుబట్టడం లేదని.. ఈ విషయం తాను సుకుమార్ గారికి కూడా చెప్పానని ఫాహద్ అన్నాడు. పుష్ప సినిమా కేవలం సుకుమార్ మీద ఉన్న ప్రేమ, గౌరవంతోనే చేశానన్న ఫాహద్.. ఎప్పటికీ తన తొలి ప్రాధాన్యం మలయాళ చిత్రాలకే అని చెప్పాడు.

ఐతే ఫాహద్‌కు సరైన ఫీడ్ బ్యాక్ లేదేమో కానీ.. ‘పుష్ప’తో ఫాహద్‌కు తెలుగు రాష్ట్రాల్లో, అలాగే నార్త్ ఇండియాలో మామూలు పాపులారిటీ రాలేదు. ‘పుష్ప-2’తో అతను మరింతగా ఇక్కడ పేరు సంపాదిస్తాడని అంచనా వేస్తున్నారు.