OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ ఎప్పుడు వస్తుందాని విపరీతంగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఓజి విడుదల. కానీ ఇవాళ రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు పార్ట్ 1 టీజర్ లో ఇది కూడా 2024లోనే వస్తుందని అధికారికంగా ప్రకటించడం కొత్త అయోమయానికి దారి తీసింది. కేవలం మూడు నెలల గ్యాప్ లో రెండు పవర్ స్టార్ రిలీజులు రావడం దాదాపు అసాధ్యం. బిజినెస్ కోణంలోనూ ఇదంత సేఫ్ గేమ్ అనిపించుకోదు. మరి ఎందుకిలా చేశారనేది కొంచెం విశ్లేషించి చూద్దాం.

ఓజికి మహా అయితే ఇంకో నెల రోజులు కాల్ షీట్స్ కావాలి. ఒకవేళ టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తు కనక అధికారంలోకి వస్తే పవన్ వెంటనే మేకప్ వేసుకుని సెట్స్ మీదకెళ్లే పరిస్థితి ఉండదు. కొంచెం టైం పడుతుంది. ఎంతలేదన్నా రెండు నెలలు పైగానే వదిలేయాల్సి ఉంటుంది. అదే జరిగితే ఓజి టార్గెట్ రీచ్ కావడం జరగని పని. అలా అయ్యే పక్షంలో హరిహర వీరమల్లు మొదటి భాగానికి సంబంధించిన బ్యాలన్స్ ని వేగంగా పూర్తి చేసి డిసెంబర్ రిలీజ్ కు సిద్ధం చేయడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర లాంటివి ఉన్నాయి కాబట్టి ఇదే మంచి నిర్ణయం అవుతుంది.

నిర్మాత ఏఎం రత్నం, ఓజి ప్రొడ్యూసర్ డివివి దానయ్యలు పరస్పరం అండర్ స్టాండింగ్ తోనే ఈ స్లాట్లు పెట్టుకున్నారో లేక ఎవరికి వారు అనౌన్స్ మెంట్లు ఇచ్చుకున్నారో తెలియదు కానీ ప్రాధాన్యత క్రమంలో చూసుకుంటే హరిహర వీరమల్లు ముందు రావడమే న్యాయం. ఫ్యాన్స్ కి మాత్రం ఓజి పట్ల విపరీతమైన ఎగ్జైట్ మెంట్ ఉంది. సో ఏదీ ఖరారుగా నమ్మలేని పరిస్థితి నెలకొంది. వీటికే ఇలా ఉంటే ఇక ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చెప్పదేముంది. హరీష్ శంకర్ ఎంత సిద్ధంగా ఉన్నా 2025 దాకా ఎదురు చూడక తప్పేలా లేదు. ఓజి లేట్ అయితే మాత్రం ఫ్యాన్సే కాదు సుజిత్ సైతం నిరాశపడతాడు. లెట్ సీ.