డైరెక్షన్ చేస్తా.. ఇప్పుడే కాదు

యువ కథానాయకుడు నిఖిల్ దర్శకుడిగా మారబోతున్నట్లు ఇటీవల ఒక హాట్ అప్ డేట్ బయటికి వచ్చింది. కొన్ని రోజలు కిందట నిఖిల్ సీరియస్‌గా కూర్చుని ఏదో రాసుకుంటున్న ఫొటో పెట్టి దీనికి సంబంధించిన అప్ డేట్ ఇవ్వునున్నట్లు సంకేతాలిచ్చాడు. నిఖిల్ సొంతంగా ఓ కథ రాశాడని.. దాన్ని తనే డైరెక్ట్ చేయబోతున్నాడని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. నిఖిల్ సన్నిహితులు కూడా ఇది నిజమే అన్నారు.

ఐతే దీని గురించి మీడియాలో వచ్చిన వార్తల మీద నిఖిల్ తాజాగా స్పందించాడు. తాను చిన్న పిల్లలతో ఒక సినిమా చేయడానికి స్క్రిప్టు రాసుకున్న మాట వాస్తవమే అని, దాన్ని తానే డైరెక్ట్ చేస్తానని అతను ధ్రువీకరించాడు. ఈ సినిమాకు బౌండ్ స్క్రిప్టు రెడీగా ఉందని కూడా చెప్పాడు. ఐతే తాను వెంటనే ఆ సినిమాను మొదలుపెట్టట్లేదని స్పష్టత ఇచ్చాడు నిఖిల్.

తాను 18 పేజెస్‌తో పాటు ‘కార్తికేయ-2’ సినిమా కూడా చేయాల్సి ఉందని.. అవి రెంటికీ పెద్ద స్థాయిలో షెడ్యూళ్లు వేసి రెడీగా ఉన్నామని.. అక్టోబరులో చిత్రీకరణ మొదలవుతుందని.. వీటి కోసం విరామం లేకుండా పని చేయబోతున్నట్లు నిఖిల్ వెల్లడించాడు. అవి పూర్తయ్యాకే దర్శకుడిగా తన సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు నిఖిల్. ఐతే ఇప్పుడే కాకున్నా.. తర్వాత అయినా నిఖిల్ లాంటి ఓ యంగ్ హీరో డైరెక్షన్ చేయబోతున్నాడంటే విశేషమే.

అందులోనూ అతను పిల్లల మీద సినిమా అంటుండటం ఇంకా ఆసక్తి రేకెత్తించేదే. మధ్యలో కొన్ని ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ నిఖిల్.. గత ఏడాది చివర్లో ‘అర్జున్ సురవరం’ సినిమాతో హిట్టు కొట్టి ఉపశమనాన్నందుకున్నాడు. గీతా ఆర్ట్స్ లాంటి ప్రముఖ బేనర్లో సుకుమార్ కథతో ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ తీయబోయే ‘18 పేజెస్’తో పాటు తన బ్లాక్ బస్టర్ మూవీ ‘కార్తికేయ’ సీక్వెల్‌తో నిఖిల్ మంచి ప్రాజెక్టులనే లైన్లో పెట్టాడు.