బాలీవుడ్ థియేటర్ల దారుణమైన పరిస్థితి

ఉత్తరాది రాష్ట్రాల్లో సరైన సినిమాలు లేక ఎగ్జిబిటర్లు గగ్గోలు పెడుతున్నారు. కనీసం కరెంటు బిల్లులు, జీతాల చెల్లింపులకు సరిపడా కలెక్షన్లు రాక వాళ్ళు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. ఇటీవలే 350 కోట్ల బడ్జెట్ తో రూపొందినట్టు హడావిడి చేసుకున్న బడేమియా చోటేమియా పదమూడు రోజులకు కేవలం 56 కోట్లే వసూలు చేయగా పాజిటివ్ టాక్ వచ్చినా సరే మైదాన్ మరీ అన్యాయంగా కేవలం 36 కోట్లే తేవడం ఇంకా ఘోరమని అక్కడి ట్రేడ్ రిపోర్ట్. దీనికి కూడా డబుల్ సెంచరీకి పైగానే ఖర్చు పెట్టారు. ప్రధాన నగరాల్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక బిసి సెంటర్ల గురించి చెప్పేదేముంది.

చాలా చోట్ల వంద రూపాయల టికెట్ రేట్ అమాంతం తగ్గించేసి 30 రూపాయలు పెడుతున్నారట. దీనివల్ల కనీసం షోకు ఒక వంద మంది వచ్చినా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. ఆగ్రాలోని రాజీవ్ థియేటర్ ఇదే ఫాలో అవుతోంది. రాజస్థాన్, బీహార్ తదితర రాష్ట్రాల్లో కొందరు ఎగ్జిబిటర్లు రెండు నెలలు హాళ్లను మూసేసే దిశగా ఆలోచిస్తున్నారు. లోకసభ ఎన్నికల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ సరైన సినిమాలు ఇవ్వడంతో బాలీవుడ్ హీరోలు దర్శకులు ఘోరంగా వైఫల్యం చెందారని దాని వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. పరిణామాల తీవ్రత అలా ఉంది.

మల్టీప్లెక్సులు సైతం మినహాయింపుగా లేవు. మెయింటెనెన్స్ రాక అల్లాడిపోతున్నాయి. ఉన్నంతలో తెలుగు తమిళం సినిమాలు కొంత నయం. హనుమాన్, గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ లాంటివి మంచి కలెక్షన్లు నమోదు చేసి బలమైన ఫీడింగ్ ఇచ్చాయి. కోలీవుడ్ లో కరువు ఏ స్థాయిలో ఉందంటే టీవీ, ఓటిటిలో సులభంగా దొరికే విజయ్ గిల్లి(ఒక్కడు రీమేక్)ని ఎగబడి చూడటంతో మొదటి వారం దాటకుండానే 12 కోట్లు వసూలు చేసి బాప్రే అనిపించింది. ఇది ఆల్ టైం రికార్డు. ఎలక్షన్లు అయ్యేదాకా ఇదంతా భరించక తప్పేలా లేదు. బాక్సాఫీస్ కు పూర్తి స్థాయి ఆక్సీజన్ ఇచ్చే బ్లాక్ బస్టర్ ఏది వస్తుందో.