ప్రతినిధి మంచి ఛాన్స్ మిస్సయ్యింది

ఎల్లుండి విడుదల కావాల్సిన ప్రతినిధి 2 వాయిదా పడటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఇరవై రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నారా రోహిత్ మూవీకి మంచి మైలేజ్ వస్తుందని భావిస్తున్న తరుణంలో ఇలా పోస్ట్ పోన్ కావడం ఊహించని పరిణామం. బయటికి చెప్పని కారణాలతో సెన్సార్ అధికారులు సినిమా చూసేందుకు సమయం కేటాయించకపోవడం వల్ల సర్టిఫికెట్ రాలేదని, అందువల్లే తప్పుకోవాల్సి వచ్చిందని యూనిట్ నుంచి వినిపిస్తున్న అనఫీషియల్ టాక్. టీవీ5 మూర్తి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ కు ట్రైలర్ తర్వాత బజ్ పెరిగింది.

ఏది ఏమైనా ప్రతినిధి 2 మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా లేక థియేటర్లు ఆలో లక్ష్మణ అంటున్నాయి. ఇలాంటి టైంలో కాస్త గుర్తింపున్న రోహిత్ లాంటి హీరోల నుంచి ప్రామిసింగ్ మూవీ వస్తోందంటే పబ్లిక్ ఖచ్చితంగా వస్తారు. మార్నింగ్ షోలు అమాంతం ఫుల్ కాకపోయినా టాక్ విన్నాక పికపయ్యే అవకాశాలు బోలెడు. అయితే రోహిత్ నేపధ్యం నేరుగా తెలుగుదేశం పార్టీతో ముడిపడి ఉండటంతో ఆ కోణంలో సెన్సార్ బోర్డు ఏమైనా సంశయపడ్డారేమో తెలియదు. చూశాక అభ్యంతరాలు చెప్పినా బాగుండేది కానీ ఇలా జరగడం ఊహించనిది.

తర్వాత ఆప్షన్ మే 3 ఉంది కానీ అప్పటికి రావడం కూడా అనుమానమేనని ఇన్ సైడ్ టాక్. ఎన్నికలు 13వ తేదీ జరుగుతాయి. ఒకవేళ సెన్సార్ నుంచి కంటెంట్ పరంగా ఏమైనా అబ్జెక్షన్ వచ్చినా, మార్పులు చేర్పులు సూచించినా లేక మొత్తానికే రివైజింగ్ కమిటీకి పంపించినా దానికి టైం పడుతుంది. సో కేవలం ఎనిమిది రోజుల్లో ఇదంత తేలే మ్యాటర్ కాదు. ఒకవేళ వందల కోట్లు ముడిపడిన స్టార్ హీరో మూవీ అయితే వేరే ఉండేది కానీ రోహిత్ విషయంలో అంత దూకుడు చూపించలేరు. మరి ప్రతినిధి 2 బృందం ఎలాంటి ఆలోచనలో ఉన్నారో రెండు మూడు రోజులు ఆగాక క్లారిటీ రావొచ్చు.