మిరాయ్ అనుకున్న పని చేసిందోయ్

హనుమాన్ తర్వాత తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్ టైటిల్ అనౌన్స్ మెంట్ నిన్న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 18 విడుదల చేయబోతున్నట్టు ఏకంగా సంవత్సరం ముందే ప్రకటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ఎపిక్ ఫాంటసీకి ఈగల్ ఫేమ్ కార్తీక ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ కొంత భాగం ఆల్రెడీ పూర్తయిన సంగతి టీజర్ చూశాక అర్థమైపోయింది. చాలా క్వాలిటీ విజువల్స్ ని మంచి విఎఫెక్స్ జోడించి చూపించిన తీరు ఆశ్చర్యపరిచింది. అంత వేగంగా ఇలాంటి అవుట్ ఫుట్ అంటే సులభం కాదు.

ఏ ఉద్దేశంతో అయితే మిరాయ్ ని పరిచయం చేశారో ఆ కార్యం నెరవేరుతోంది. హనుమాన్ హీరోగా తేజ సజ్జకు నార్త్ లో బాగా గుర్తింపు వచ్చింది. తన నెక్స్ట్ మూవీకి గ్యాప్ ఎక్కువగా వస్తున్నప్పుడు వాళ్ళు తనను మర్చిపోయే రిస్క్ ఉంది. ఇప్పుడు మిరాయ్ వల్ల దీని గురించిన చర్చ ఆడియన్స్ తో పాటు బాలీవుడ్ వర్గాల్లోనూ జరుగుతోంది. పెద్ద స్టార్ హీరోలకు మాత్రమే ఇంత బడ్జెట్ పెట్టే ఉత్తరాది పరిశ్రమకు, హీరో ఇమేజ్ కాకుండా కంటెంట్ మీద ఖర్చు పెట్టే టాలీవుడ్ ధోరణికి తేడా తెలుసుకుంటున్నారు. సబ్జెక్టులో సత్తా ఉంటే వందల కోట్లు వస్తాయని హనుమాన్, కాంతారలు నిరూపించాయి.

సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మిరాయ్ ప్రొడక్షన్ ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ అంచనాలు పెంచే దిశగా ప్లానింగ్ చేసుకుంటే రిలీజ్ నాటికి బిజినెస్ డిమాండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. హీరో ఎవరనే దానితో సంబంధం లేకుండా క్రేజీ రేట్లు పెట్టి బయ్యర్లు కొంటారు. ఇప్పటికైతే 2025 ఏప్రిల్ 18 ఎవరూ లాక్ చేసుకోలేదు. అసలు అంత దూరం ఆలోచించలేదు కూడా. పోనీ రాజా సాబ్ వస్తుందనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది కూడా పీపుల్స్ మీడియా నిర్మాణమే కాబట్టి వేరే ఆప్షన్ అనుకునే ఉంటారు. ఏదైతేనేం మిరాయ్ అనుకున్న కార్యాన్ని నెరవేర్చేస్తోంది.