శ్రీవిష్ణు రూటు మార్చడం మంచిదే

ఆ మధ్య కొంత కాలం వరస ఫ్లాపులతో సతమతమైన శ్రీవిష్ణు తిరిగి గాడిన పడ్డాడు. సామజవరగమన ఊహించిన దానికన్నా చాలా పెద్ద సక్సెస్ కావడం మార్కెట్ పరంగా ఎంతో ఉపయోగపడింది. ఈ కారణంగానే ఓం భీం బుష్ మంచి బిజినెస్ చేసుకోగలిగింది. రెండూ కామెడీ ఎంటర్ టైనర్లు కావడం గమనించాల్సిన విషయం. రేంజ్ పరంగా ఒకటే ఫలితం అందుకోనప్పటికీ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు దోహదం చేశాయి. గతంలో రాజా రాజా చోర కూడా వినోదాత్మక జానర్ లోనే వచ్చి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ సీరియస్ బాట పట్టనున్నాడు శ్రీవిష్ణు.

హుసేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందబోయే క్రైమ్ థ్రిల్లర్ లో డిఫరెంట్ గా ట్రై చేయబోతున్నాడు. ఇప్పటికే అరవై శాతం పూర్తి చేసుకున్న ఈ మూవీలో తనతో రెండోసారి ఈషా రెబ్బ మోనికా హీరోయిన్ గా జోడి కడుతోంది . అనౌన్స్ మెంట్ టీజర్ లో చూచాయగా కాన్సెప్ట్ ఏంటో చెప్పింది కానీ ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఒక నేరానికి సంబంధించిన పరిశోధనలో శ్రీవిష్ణు నిమగ్నమైన విజువల్స్ ని మాత్రమే చూపించారు. ఆ మధ్య సీరియస్ గా శ్రీవిష్ణు ట్రై చేసిన భళా తందనాన, అల్లూరి, తిప్పరా మీసం లాంటివి ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయాయి.

అలా అని పూర్తిగా కామెడీకే కట్టుబడినా అల్లరి నరేష్ లాగా కెరీర్ రిస్క్ లో పడుతుంది. అందుకే అన్ని రకాలుగా ట్రై చేయడం ఉత్తమం. దీని కన్నా ముందు శ్రీవిష్ణు స్వాగ్ రిలీజవుతుంది. ఇది ఎంటర్ టైన్మెంట్ బ్యాచే. ఒక ప్లానింగ్ ప్రకారం సినిమాలు ఎంచుకుంటున్న శ్రీవిష్ణు ఇలా ఒకదానితో మరొకటి సంబంధం లేని కథలు చేయడం వల్లే మంచి ఫలితాలు వస్తాయి. ఒకటి రెండు అంచనాలు అందుకోకపోయినా ఒక బ్లాక్ బస్టర్ లెక్కను సెటిల్ చేస్తుంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అసలే పోటీ ఎక్కువగా ఉన్న ట్రెండ్ లో ఈ మాత్రం శ్రద్ధ తీసుకోవడం అవసరమే.