దానయ్య చేయి జారుతున్న విజయ్ మూవీ ?

మన తెలుగు నిర్మాతలు కోలీవుడ్ లో పాగా వేయడం మెల్లగా పెరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సితార ఎంటర్ టైన్మెంట్స్, ఏషియన్ తదితర బ్యానర్లు ఇప్పటికే మీడియం, పెద్ద బడ్జెట్ సినిమాలతో జెండాలు పాతడం గత ఏడాది నుంచి వేగం పుంజుకుంది. ఇదే కోవలోకి డివివి దానయ్య కూడా భారీ ప్లాన్ తో స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. రాజకీయ ప్రవేశానికి ముందు విజయ్ చేయబోయే చివరి కోలీవుడ్ మూవీగా ప్రచారంలో ఉన్న ప్యాన్ ఇండియా మూవీని ఈయనే నిర్మిస్తారని రెండు నెలల క్రితమే ప్రచారం జరిగింది. ఆ వార్తను దానయ్య ఎక్కడా ఖండించలేదు.

దీంతో సహజంగానే ఈ ప్రాజెక్టు ఆన్ లో ఉందనే అనుకున్నారు. తాజాగా వినిపిస్తున్న చెన్నై టాక్ ప్రకారం దానయ్య దీన్ని వదులుకోబోతున్నారట. విజయ్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో పాటు తాను చెప్పిన దర్శకుడు, కథతోనే తీయాలని కండీషన్ పెట్టడం వల్ల ఇది వర్కౌట్ కాదని గ్రహించి సైలెంట్ గా తప్పుకునే ప్లాన్ లో ఉన్నారని వినికిడి. అధికారికంగా దీనికి సంబంధించి ఎలాంటి ధృవీకరణ లేకపోయినప్పటికీ అంతర్గతంగా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం చూస్తే నిప్పు లేనిదే ఉత్తుత్తినే పొగరాదుగా. సో తెరవెనుక ఏదో జరిగే ఉండొచ్చు.

పొలిటికల్ స్టాండ్ విషయంలో బలంగా ఉన్న విజయ్ తన ఆఖరి మూవీని కూడా దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకుంటున్నారు. దర్శకుడు హెచ్ వినోత్ చెప్పిన స్టోరీ బాగా నచ్చిందట. ప్రస్తుతం వెంకట్ ప్రభుతో చేస్తున్నది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం (గోట్) షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇంకో రెండు నెలల్లో గుమ్మడికాయ కొట్టేసి ఆ తర్వాత రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. హెచ్ వినోత్ కాకుండా పలువురు ఇతర దర్శకులు విజయ్ కు కథలు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశారు కానీ ఏవీ ఒక పట్టాన కొలిక్కి రాలేదు. దానయ్య నిజంగా వదిలేసుకున్నారా లేక ఇదంతా గాసిప్పా అనేది కొంచెం వేచి చూస్తే తేలుతుంది.