మ‌ళ్లీ హీరోగా త‌రుణ్ భాస్క‌ర్

త‌రుణ్ భాస్క‌ర్‌కు ద‌ర్శ‌కుడిగానే కాదు.. న‌టుడిగానూ మంచి ఫాలోయింగ్ ఉంది. ద‌ర్శ‌కుడిగా త‌న రెండో చిత్రం ఈ న‌గ‌రానికి ఏమైంది త‌ర్వాత అత‌ను న‌టుడిగా బిజీ అయ్యాడు. అర‌డ‌జ‌ను సినిమాల‌కు పైగానే న‌టించాడు. అత‌ను లీడ్ రోల్ చేసిన మీకు మాత్ర‌మే చెప్తాలో కామెడీ అద‌ర‌గొట్టాడు. అదే కాక ఫ‌ల‌క్ నుమా దాస్, మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి చిత్రాల్లో కూడా అత‌డి కామెడీ బాగా పండింది.

ఇక త‌న స్వీయ ద‌ర్శ‌కత్వంలో కొన్ని నెల‌ల కింద‌టే వ‌చ్చిన కీడా కోలా సినిమాలో నాయుడు పాత్ర‌లో అత‌నెంత‌గా ఎంట‌ర్టైన్ చేశాడో తెలిసిందే. ద‌ర్శ‌కుడిగా కంటే న‌టుడిగానే అత‌ను ఎక్కువ‌గా అల‌రించాడు. ఈ సినిమా త‌ర్వాత న‌టుడిగా అత‌ణ్ని మ‌రిన్ని పాత్ర‌ల్లో చూడాల‌ని ప్రేక్ష‌కులు ఆశించారు.

అందుకు త‌గ్గ‌ట్లే త‌రుణ్ భాస్క‌ర్ ఇప్పుడు హీరోగా ఓ సినిమా చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో అత‌డి స‌ర‌స‌న ఈషా రెబ్బా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సీనియ‌ర్ న‌టుడు బ్ర‌హ్మాజీ ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇదొక క్రైమ్ కామెడీ అంటున్నారు. సంజీవ్ అనే దర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

ఇక ద‌ర్శ‌కుడిగా త‌రుణ్ త‌ర్వాతి సినిమా విష‌యంలో ఏ అప్‌డేట్ లేదు. సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా త‌రుణ్ ఓ సినిమా చేయాల్సింది. అది వ‌ర్క‌వుట్ కాలేదు. అది కుద‌ర‌ని నేప‌థ్యంలోనే కీడాకోలా సినిమాను తెర‌కెక్కించాడు. ఈ చిత్రం ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. దీంతో ద‌ర్శ‌కుడిగా మ‌ళ్లీ బ్రేక్ తీసుకుని న‌టుడిగా బిజీ అయ్యే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లున్నాడు త‌రుణ్‌.