2025 సంక్రాంతి : పెరుగుతున్న పోటీ పుంజులు

టాలీవుడ్ బంగారు బాతులా భావించే సంక్రాంతి సీజన్ కోసం మన హీరోలు, నిర్మాతలు ఎంతగా టార్గెట్ చేసుకుంటారో కొత్తగా చెప్పడానికేం లేదు కానీ క్రమంగా దాన్ని నెలల ముందే రిజర్వ్ చేసుకునే ట్రెండ్ మాత్రం క్రమంగా ఊపందుకుంటోంది. ఇంకా తొమ్మిది నెలల సమయం ఉన్నప్పటికీ 2025 జనవరి మీద కర్చీఫ్ లు వేసే సంఖ్య పెరుగుతూ పోతోంది. చిరంజీవి విశ్వంభర మొదటగా అధికారిక ప్రకటన చేసుకుని సేఫ్ గేమ్ ఆడింది. పండక్కు నాలుగు రోజుల ముందే వస్తామని పదో తేదీని అఫీషియల్ గా లాక్ చేసుకున్నారు. దానికి అనుగుణంగానే వేగంగా షూటింగ్ చేస్తున్నారు.

ఇవాళ రవితేజ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించబోయే ఎంటర్ టైనర్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ త్వరలోనే చిత్రీకరణకు వెళ్లబోతున్నారు. ప్రీ లుక్ పోస్టర్ లోనే సంక్రాంతి అని చెప్పేశారు. ఎఫ్2, ఎఫ్3 తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం చేతులు కలుపుతున్న వెంకటేష్ అనిల్ రావిపూడిల సినిమా కూడా పండక్కు రావడం ఖాయం. శతమానం భవతి నెక్స్ట్ పేజీని వదులుతానని చెప్పిన నిర్మాత దిల్ రాజు దాని స్థానంలో వెంకీ మూవీని రిలీజ్ చేస్తారు. ఈ మాట నేరుగా కాకపోయినా చూచాయగా పలు సందర్భాల్లో ఆయనే చెప్పారు.

నా సామిరంగ సక్సెస్ తర్వాత నాగార్జున మరోసారి పండగనే కోరుకుంటున్నారు. సెట్స్ మీదున్న రెండు సినిమాల్లో ఏది వస్తుందో తెలియదు కానీ ఏదో ఒకటి రావడమైతే రావడమైతే కన్ఫర్మే. యువి క్రియేషన్స్ విశ్వంభర నిర్మాతలు కాబట్టి ప్రభాస్ ది రాజా డీలక్స్ ఈ పోటీలో దిగడం అనుమానమే. ఇంకెవరెవరు వస్తారో రోజులు గడిచే కొద్దీ తెలుస్తుంది. అయినా ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన అందరూ మాట మీద ఉంటారన్న గ్యారెంటీ లేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎవరు ఉంటారో ఎవరు తప్పుకుంటారో ఇప్పుడే చెప్పలేం కానీ బోలెడు మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి.