ముచ్చటైన హిట్టు కొట్టిన ముగ్గురు భామలు

మనకు టిల్లు స్క్వేర్ సందడితో సరిపోయింది కానీ బాలీవుడ్ లో అదే రోజు విడుదలైన క్రూ కూడా మంచి వసూళ్లతో విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమాకో ప్రత్యేకత ఉంది. దీంట్లో హీరోలు లేరు. సీనియర్ జూనియర్ కలిపి ముగ్గురు హీరోయిన్లను ప్రధాన పాత్రలో పెట్టి రాజేష్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ వచ్చే దాకా అసలిది నిర్మాణంలో ఉన్న సంగతే తెలియదు. 90 దశకం నుంచి టబు, 2000 టైం నుంచి కరీనా కపూర్, ప్రస్తుత జనరేషన్ నుంచి కృతి సనన్ ని తీసుకున్నారు. విశేషమేంటంటే వయసుతో సంబంధం లేకుండా వీళ్లకు గ్లామర్ టచ్ జోడించడం.

విమానంలో క్యాబిన్ క్రూగా పని చేసే ముగ్గురు మహిళల చుట్టూ నడిచే కథే ఈ మూవీ. కోహినూర్ ఎయిర్ లైన్స్ యజమానికి ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు సరిపడా డబ్బు లేక సతమతమవుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితిలో ఒక స్టాఫ్ అనుకోని పరిస్థితుల్లో చనిపోతాడు. తీరా చూస్తే అతను బంగారం దొంగ రవాణా చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడని గ్రహించిన టబు, కరీనా, కృతి ఏకంగా ఇదంతా చేసే డాన్ తో డీల్ మాట్లాడుకునేందుకు సిద్ధ పడతారు. ముందు తేలికే అనుకుంటారు కానీ ముందుకెళ్లే కొద్దీ ప్రమాదాలు, ఇబ్బందులు చుట్టుముడతాయి. ఆ తర్వాత జరిగేదే స్టోరీ.

ఆద్యంతం గొప్పగా లేకపోయినా కాలక్షేపానికి లోటు లేకుండా క్రూ సాగుతుంది. అలా కాకుండా ఏదేదో ఊహించుకుంటే మాత్రం అసంతృప్తి మిగిలే అవకాశం లేకపోలేదు. మధ్యలో అక్కర్లేని సన్నివేశాలు, ల్యాగ్ ఉంది. ఓ మోస్తరు వినోదం తప్ప మరీ ఎక్స్ ట్రాడినరీగా ఉండదు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ కొంత మేరకు కాపాడుతూ వచ్చింది. వారం తిరక్కుండానే 50 కోట్లకు పైగా గ్రాస్ ని దాటేసిన క్రూ కొన్ని వారాలుగా డల్లుగా ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్ కి కొంత కిక్ ఇచ్చింది. మనకు అంతగా ఎక్కకపోవచ్చు కానీ నార్త్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్న వైనం వసూళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది.