కొత్త ద‌ర్శ‌కుల‌కు దేవ‌ర‌కొండ నో ఎంట్రీ

కెరీర్ ఆరంభం నుంచి ఎక్కువ‌గా కొత్త ద‌ర్శ‌కుల‌తోనే ప‌ని చేస్తూ వ‌చ్చాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పెళ్లిచూపులుతో త‌రుణ్ భాస్క‌ర్, అర్జున్ రెడ్డితో సందీప్ రెడ్డి వంగ అత‌డి కెరీర్‌ను గొప్ప మ‌లుపు తిప్పారు. అలాంటిది ఇప్పుడు కొత్త ద‌ర్శ‌కులకు నో ఛాన్స్ అని విజ‌య్ దేవ‌ర‌కొండ అంటుండడం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం.

ఫ్యామిలీ స్టార్ త‌మిళ వెర్ష‌న్ ప్ర‌మోష‌న్ కోసం చెన్నై వెళ్లిన విజ‌య్.. అక్క‌డ ఓ ఇంట‌ర్వ్యూలో డెబ్యూ డైరెక్ట‌ర్ల గురించి మాట్లాడాడు. మీరు త‌మిళం నుంచి కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశ‌మిస్తారా అని అడిగితే.. ప్ర‌స్తుతం తాను డెబ్యూ డైరెక్ట‌ర్ల గురించి ఆలోచించ‌ట్లేద‌ని చెప్పాడు. కొత్త ద‌ర్శ‌కులు బ‌డ్జెట్, ఇత‌ర విష‌యాల‌ను హ్యాండిల్ చేయ‌డం క‌ష్ట‌మ‌ని.. అందుకే తాను కొంచెం అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుల వైపు చూస్తున్నాన‌ని విజ‌య్ తెలిపాడు.

ఒక్క సినిమా అనుభ‌వం ఉన్నా చాలు, తాను ప‌ని చేయ‌డానికి రెడీ అని.. ఆ ద‌ర్శ‌కుడు తీసిన సినిమాను ప‌రిశీలించి.. త‌న మ్యూజిక్ సెన్స్, ఎడిట్ సెన్స్ లాంటివి చూసి ప‌ని చేయ‌డానికి రెడీ అవుతాన‌ని విజ‌య్ తెలిపాడు. ఒక ద‌ర్శ‌కుడు తీసిన తొలి చిత్రం ఫెయిలైనా ప‌ర్వాలేద‌ని.. త‌న ప‌నిత‌నం న‌చ్చితే సినిమా చేస్తాన‌ని విజ‌య్ చెప్పాడు.

నిజానికి విజ‌య్‌కి కొంచెం అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుల‌తోనే చేదు అనుభ‌వాలున్నాయి. ఎంతో అనుభ‌వ‌జ్ఞుడైన పూరి జ‌గ‌న్నాథ్ తీసిన లైగ‌ర్ ఏమైందో తెలిసిందే. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డినేకాక కొత్త ద‌ర్శ‌కుడైన రాహుల్ సంకృత్య‌న్ తీసిన ట్యాక్సీవాలాతోనూ విజయాన్నందుకున్నాడు. మ‌రో డెబ్యూ డైరెక్ట‌ర్ భ‌ర‌త్ క‌మ్మ తీసిన డియ‌ర్ కామ్రేడ్ స‌రిగా ఆడ‌క‌పోయినా మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. మ‌రి ఇలాంటి అనుభ‌వాలున్న హీరో కొత్త ద‌ర్శ‌కుల‌కు నో ఎంట్రీ బోర్డు పెట్టేయ‌డ‌మేంటో?