బీజేపీపై సాములోరి ఆగ్ర‌హం.. టికెట్ కోసం బెదిరింపులు!

స‌ర్వ‌సంఘ ప‌రిత్యాగుల‌మ‌ని చెప్పుకొనే స్వాములు.. మ‌ఠాలు న‌డుపుకొనే స్వామీజీలు కూడా.. కొన్నాళ్లుగా రాజ‌కీయ నేత‌లుగా మారిపోయిన విష‌యం తెలిసిందే. మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని భోపాల్ నియోజ‌క‌వ‌ర్గం దీనికి తొలి బీజం వేసింది. ఇక్క‌డ నుంచి బీజేపీ త‌ర‌ఫున ఫైర్ బ్రాండ్ మ‌హిళా స్వామీజీ సాధ్వి ప్ర‌జ్ఞ పోటీ చేసి విజయం ద‌క్కించుకున్నారు. ఇక‌, అక్క‌డ నుంచి  బీజేపీలో స్వాములు పోటీ చేయ‌డం విజ‌యం ద‌క్కించుకోవ డం కామ‌న్‌గా మారిపోయింది. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కూడా ఇదే బ్యాచ్‌.

ఇక‌, ఎటొచ్చీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే స్వామీజీల‌కు, మ‌ఠాధిప‌తుల‌కు బీజేపీ టికెట్ ఇవ్వ‌లేదు. అయితే.. ఇప్పుడు అది కూడా తెర‌మీదికి వ‌చ్చింది. త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే.. ఇండిపెండెంట్ అయినా.. పోటీ చేసి గెలుస్తాన‌ని.. కాకినాడ శ్రీపీఠం అధిప‌తి.. బీజేపీ నాయ‌కుడు స్వామిప‌రిపూర్ణానంద తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. దీంతో ఇప్పుడు బీజేపీపై సాములోరికి కోపం వ‌చ్చిందంటూ.. సోష‌ల్ మీడియాలో స‌టైర్లు వేస్తున్నారు.

హిందూపురం నుంచి పోటీచేయాలని ఆశించి భంగపడిన పరిపూర్ణానందస్వామి ఆగ్ర‌హంతో ఊగిపోయారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా హిందూపురం టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి పోటీచేయాలని భావించిన పరిపూర్ణానందకు ఇది తీవ్ర నిరాశ మిగిలింది. ఈ నేపథ్యంలో ఆయన సంచలన‌ వ్యాఖ్యలు చేశారు. టికెట్ విషయంలో పునరాలోచన చేయకుంటే హిందూపురం నుంచి ఇండిపెండెంట్‌‌గా పోటీచేసేందుకు వెనుకాడబోనని హెచ్చరించారు.

వాస్త‌వానికి గ‌త రెండేళ్లుగా స్వామి ప‌రిపూర్ణానంద‌.. హిందూపురంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని కూడా ఆయ‌న ద‌ర‌ఖాస్తు చేస్తున్నారు. అయితే.. బీజేపీ ఆయ‌న‌కు టికెట్ నిరాకరించిం ది. దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి, అదేస‌మ‌యంలో మనస్తాపానికి గురయ్యారు. తాను హిందూపురం నుంచి బరిలోకి దిగుతానని పొత్తులకు ముందే అధిష్ఠానానికి చెప్పానని గుర్తుచేశారు. అయితే.. చిత్రంగా ఇక్క‌డ ఆయ‌న టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

“హిందూపురం సీటును స్వామీజీకి ఇస్తే ముస్లింలు దూరమవుతారని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.  ముస్లింల కోసం హిందువులను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారు. ముస్లింల కోసం 85 శాతం ఓటుబ్యాం కు ఉన్న హిందువులను బొందలో పెట్టేందుకు ఆయన టికెట్ రాకుండా చేశారు. నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిని. దక్షిణాదిలో హిందూపురం చాలా ముఖ్యమైన ప్రాంతం పేరులోనే హిందూ ఉంది. అందుకే ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డం ఖాయం” అని స్వాములోరు సెలవిచ్చారు.