తారక్ 31 వెనుక ఏం జరుగుతోంది

ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వచ్చే నెల నుంచి దీంతో పాటు వార్ 2 కోసం సమాంతరంగా డేట్లు కేటాయించబోతున్నాడు. అక్టోబర్ 10 ఎంతో దూరంలో లేనందున దర్శకుడు కొరటాల శివ దేవరకు సంబంధించిన పనులను వేగవంతం చేస్తున్నాడు. రెండు భాగాలు కావడంతో ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ కి తగ్గకుండా ఉండాలి. అప్పుడే సీక్వెల్ మీద అంచనాలు, బిజినెస్ పెరుగుతాయి. అందుకే ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకుని వాయిదాలు వేయాల్సి వస్తున్నా సరే ఆగకుండా చిత్రీకరణ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం గోవాలో ఉన్న సంగతి తెలిసిందే.

కెజిఎఫ్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ చేయాల్సింది తారక్ తోనే. ముందైతే వేసవిలో మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ జూనియర్ డేట్లు అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేయక తప్పలేదు. ఒకవేళ దేవర ముందు అనుకున్న ప్రకారం ఏప్రిల్ 5 విడుదలయ్యుంటే సాధ్యమయ్యేది. సో నీల్ ప్రస్తుతం సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వంకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ప్రభాస్ నుంచి కాల్ షీట్లు రావడం ఆలస్యం వెంటనే షూట్ మొదలుపెట్టేస్తారు. ఇంకోవైపు తారక్ కోసం రాసిన కథను రెండు భాగాలుగా చెప్పే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్.

కెజిఎఫ్ తరహాలో పెద్ద స్పాన్ కావడంతో మూడు గంటల్లో చెప్పే బదులు సలార్ లాగే టూ పార్ట్ కే ఓటు వేయాలని అనుకుంటున్నారట. మైత్రి మూవీ మేకర్స్ దానికి సిద్ధంగానే ఉన్నారు కానీ జూనియర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. బ్యాక్ టు బ్యాక్ రెండు భాగాల సినిమాలు చేయడం వల్ల సమయం ఎక్కువ ఖర్చయ్యే విషయాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. కాబట్టి తారక్, నీల్ ఫ్రీ అయ్యేదాకా ఈ వ్యవహారం అంత సులభంగా తేలదు. ఈ ఏడాది డిసెంబర్ లోగా జూనియర్ ఎన్టీఆర్ దేవర, వార్ 2 పూర్తి చేస్తాడు. ఆలోగా ప్రశాంత్ నీల్ ఫైనల్ వెర్షన్ సిద్ధం చేయాల్సి ఉంటుంది.