లాజిక్కుల మీద నిర్మాత క్లాస్

టాలీవుడ్ నిర్మాతల్లో బాగా ఔట్ స్పోకెన్‌గా ఉండేవాళ్లలో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఒకరు. సినిమా వేడుకల్లో అయినా.. ఇంటర్వ్యూల్లో అయినా.. సోషల్ మీడియాలో అయినా చాలా దూకుడుగా మాట్లాడతాడాయన. కొన్నిసార్లు తన వ్యాఖ్యలు వివాదాస్పదం అయినా.. అవేమీ పట్టించుకోకుండా తన స్టయిల్లో ముందుకు వెళ్లిపోతుంటాడు.

తమ కుటుంబ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నుంచి వచ్చిన చివరి చిత్రం ‘గుంటూరు కారం’ను విమర్శించిన వాళ్లందరి మీదా ఆయన పలుమార్లు ఎదురు దాడి చేశాడు. ఈ సినిమాలో లాజిక్కుల గురించి మాట్లాడితే.. ఆయనకు తెగ కోపం వచ్చేసింది. ‘గుంటూరు కారం’ అనే కాదు.. పెద్ద హీరోల సినిమాలు వేటిలోనూ లాజిక్కులే వెతకొద్దని అంటున్నాడు నాగవంశీ. తాజాగా ఒక రివ్యూయర్‌తో జరిపిన వీడియో సంభాషణలో ఆయన ‘లాజిక్స్’ టాపిక్ మీద అందరికీ క్లాస్ పీకాడు.

‘సలార్’ సినిమాలో ఒక టాటూ చూసి విలన్ గ్యాంగ్‌ అదిరిపడిపోవడం గురించి స్పందిస్తూ.. ప్రభాస్ రేంజి హీరోకు ఇలాంటి ఎలివేషన్ ఉండడం సమంజసమే అని.. విలన్ గ్యాంగ్ ఆ టాటూ చూడగానే ప్రభాస్, అతను గతంలో చేసిన విధ్వంసం తలుచుకుని ఉలిక్కి పడతాడని.. ఆ ఎలివేషన్ ప్రభాస్ అభిమానులకు నచ్చుతుందని.. పెద్ద హీరోల సినిమాలు తీసేదే అభిమానుల కోసం అయినపుడు అక్కడ లాజిక్స్ వెతకడం ఏంటని నాగవంశీ అన్నాడు. సమీక్షకులు ఇలాంటి సీన్లను తప్పుబడతారని.. కానీ ‘సలార్’ భారీగా రెవెన్యూ తెచ్చిందని.. మరి సమీక్షకులు కరెక్టా, ఆ సినిమాకు అన్ని డబ్బులిచ్చిన ప్రేక్షకులు కరెక్టా అని నాగవంశీ ప్రశ్నించాడు.

‘గుంటూరు కారం’లో హీరో పదే పదే గుంటూరు-హైదరాబాద్ ట్రావెల్ చేయడం గురించి వచ్చిన విమర్శలపై మాట్లాడుతూ.. అలా వెళ్తే తప్పేంటి.. హీరో జర్నీ అంతా చూపించి, మధ్యలో టీ తాగితే అదీ చూపించాలా అని నాగవంశీ అన్నాడు. మహేష్ గత కొన్ని చిత్రాల నుంచి ప్రి క్లైమాక్స్‌లో వచ్చే మాస్ పాటలో అదరగొట్టేస్తున్నాడని.. ఆ ఉద్దేశంతో గత సినిమాల పాటలను మించి ఉండాలని ‘కుర్చీ మడత పెట్టి’ పాట పెట్టామని.. కానీ ఆ పాటలోకి శ్రీలీల ఎలా వచ్చిందంటూ లాజిక్స్ వెతికారని అభిమానులను అలరించాలని పెట్టిన పాటలో లాజిక్స్ వెతకడం ఏంటని నాగవంశీ అన్నాడు.