వెంకీ-2 చేస్తాడట.. సాధ్యమేనా?

టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు శ్రీను వైట్ల. వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి చిత్రాలతో అతను భారీ విజయాలను అందుకుని టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా ఉండేవాడు వైట్ల. కానీ ‘దూకుడు’ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన మహేష్ బాబుతోనే అతను చేసిన ‘ఆగడు’ సినిమా డిజాస్టర్ అయ్యాక ఆయన కెరీర్ తిరగబడింది. ఆ తర్వాత ఆయన్నుంచి వచ్చిన బ్రూస్‌లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి.

‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తర్వాత శ్రీనుకు నాలుగేళ్లకు పైగా గ్యాప్ వచ్చింది. అతి కష్టం మీద గోపీచంద్ హీరోగా ఒక సినిమా ఓకే చేయించుకుని గత ఏడాది చిత్రీకరణ మొదలుపెట్టాడు వైట్ల. కానీ తర్వాత ఆ సినిమా గురించి అతీ గతీ లేదు. ఈ సినిమాకు నిర్మాతలు కూడా మారినట్లు వార్తలు వచ్చాయి.

అసలు గోపీతో వైట్ల చేస్తున్న సినిమా పూర్తయి, విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు కలుగుతుంటే.. ఆయనేమో ‘వెంకీ’ మూవీకి సీక్వెల్ చేస్తానంటున్నాడు. గత ఏడాది డిసెంబరు 31న ‘వెంకీ’ సినిమా రీ రిలీజ్ అయి మంచి స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అప్పట్నుంచి చాలామంది దీని సీక్వెల్ గురించి అడుగుతున్నారని.. తాను కూడా ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని వెంకీ-2కు స్క్రిప్ట రెడీ చేయిస్తున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు వైట్ల.

ఐతే తన వరకు వైట్ల ఈ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు కానీ.. వెంకీ-2 నిజంగా సాధ్యమా అన్నది ప్రశ్న. వైట్ల స్లంప్‌లో ఉండగా తన అభిమానులు వద్దు వద్దంటున్నా వినకుండా తనతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చేశాడు రవితేజ. ఫలితంగా కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. అలాంటిది ఇప్పుడు వెంకీ-2 చేయడానికి మాస్ రాజా ఎలా ముందుకు వస్తాడు? అయినా ‘వెంకీ’లో నటించిన ముఖ్య పాత్రధారుల్లో చాలామంది ఇప్పుడు లైమ్ లైట్లో లేరు. ఇన్నేళ్ల తర్వాత ఆ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి.