డబుల్ ఇస్మార్ట్.. అప్పుడే

టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్స్‌లో ‘డబుల్ ఇస్మార్ట్’ ఒకటి. 2019లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కు కొనసాగింపుగా ఈ చిత్రం చేస్తోంది రామ్-పూరి జగన్నాథ్ జోడీ. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఇటు పూరికి, అటు రామ్‌కు కలిసి రాలేదు. పూరి.. ‘లైగర్’తో దారుణమైన పరాజయాన్ని అందుకున్నాడు. ఇక రామ్ సినిమాల్లో ‘రెడ్’ ఏదో యావరేజ్‌గా ఆడగా.. వారియర్, స్కంద డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఇద్దరికీ ‘డబుల్ ఇస్మార్ట్’ సక్సెస్ చాలా అవసరం.

ఐతే పెద్ద హిట్ సినిమాకు సీక్వెల్ కావడం వల్ల దీనికి ఆరంభంలోనే మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా చకచకగా సినిమా లాగించేయడం పూరికి అలవాటు. కానీ ‘డబుల్ ఇస్మార్ట్’కు కాస్త ఎక్కువ సమయమే తీసుకుంటున్నాడు.

ముందు అనుకున్న ప్రకారం మార్చిలోనే ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ కావాల్సింది. కానీ కుదరలేదు. తర్వాత వేసవి చివర్లో అన్నారు. అది కూడా సాధ్యపడట్లేదట. మేలో కూడా ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ కాబోదు. సినిమాను ఆ టైంలోకి రెడీ చేయడమూ కష్టమే. పైగా ఎన్నికల హడావుడి ఉంటుంది. అందుకే జూన్ నెలకు సినిమాను వాయిదా వేసినట్లు సమాచారం. ఆ నెల మధ్యలో ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజవుతుందని సమాచారం. త్వరలోనే ఈమేరకు కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తారట.

సినిమా ఇప్పటికే 75 శాతం దాకా పూర్తయినట్లు చిత్ర వర్గాల సమాచారం. ‘డబుల్ ఇస్మార్ట్’లో రామ్ సరసన హాట్ బ్యూటీ కావ్య థాపర్ నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. పూరితో కలిసి ఛార్మి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.