జాన్వీ చెల్లెలితో రీమేక్ వర్కౌటయ్యేనా

దర్శకుడు బుచ్చిబాబు డెబ్యూ ఉప్పెన మూడేళ్ళ క్రితం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఒక సున్నితమైన పాయింట్ ని హ్యాండిల్ చేసిన విధానం, సాధారణంగా తెలుగు ప్రేక్షకులు అంగీకరించని హీరో ట్రీట్మెంట్ ని చూపించిన వైనం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలు ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ లిస్టులోకి చేరిపోయారు. తర్వాత దాన్ని నిలబెట్టుకునే దిశగా సినిమాలు ఎంచుకోకపోవడం వేరే విషయం. ఇంత విజయం సాధించినా ఉప్పెన ఏ భాషలోనూ రీమేక్ కాలేదు. ఎవరూ హక్కులు అడగలేదో లేక మైత్రి వాళ్ళు ఇవ్వలేదో ఇంకా సస్పెన్సే.

అలాంటి ఉప్పెన మీద జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ మనసు పడ్డారు. రెండో కూతురు ఖుషి కపూర్ తో తీస్తే బాగుంటుందనే ఆలోచన ఆయన మనసులో బలంగా ఉంది. నిన్న రామ్ చరణ్ 16 ఓపెనింగ్ సందర్భంగా ఈ విషయం చెప్పడంతో ఆ దిశగా అడుగులు పడొచ్చని ఇన్ సైడ్ టాక్. అయితే ఉప్పెన హిందీలో వర్కౌట్ కావడం ఈజీ కాదు. మన ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కావడానికి కారణం నేటివిటీ. బుచ్చిబాబు దాన్ని ఒడిసిపట్టిన తీరు, సహజంగా తీర్చిదిద్దిన పాత్రలు మరింత చేరువ చేశాయి. అదే మేజిక్ ని బాలీవుడ్ లో రిపీట్ చేయడం మాములు రిస్క్ కాదు.

పైగా ఖుషి కపూర్ తెరంగేట్రం చేసిన ఆర్చీస్ లో నెగటివ్ మార్కులు పడ్డాయి. ఉప్పెన లాంటి ఛాలెంజింగ్ సబ్జెక్టుకి తను సూట్ అవుతుందో చూసుకోవాలి. బోనీ కపూర్ మాత్రం రకరకాల కాంబోలు చూస్తున్నారని వినికిడి. బుచ్చిబాబు చేయలేడు కాబట్టి సమర్ధవంతంగా రీమేక్ చేసే డైరెక్టర్ దొరకాలి. ఇదో పెద్ద తలనెప్పి. జాన్వీని ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో మొదలుపెట్టి మెల్లగా సౌత్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ల సరసన అవకాశాలు వచ్చేదాకా సక్సెసయ్యాడు కానీ ఖుషీ కపూర్ ని అదే స్థాయిలో నిలబెట్టడం ఆయనకో సవాల్ గా మారుతోంది.