వీరమల్లు టీం ధైర్యాన్ని మెచ్చుకోవాలి

హరిహర వీరమల్లు అనే సినిమా అనౌన్స్ అయి నాలుగేళ్లు కావస్తోంది. ప్రకటించిన కొన్ని నెలలకే చిత్రీకరణ కూడా మొదలుపెట్టారు. కానీ మొదలైన నాలుగేళ్లకు కూడా సినిమా రిలీజవుతుందన్న గ్యారెంటీ ఏమీ కనిపించడం లేదు. దీని తర్వాత మొదలైన పవన్ కళ్యాణ్ సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజవుతున్నాయి కానీ.. దీనికి మాత్రం మోక్షం కలగట్లేదు. ఇది భారీ సినిమా. పవన్‌కేమో తన రాజకీయ, వేరే సినిమా కమిట్మెంట్ల మధ్య దీని కోసం ఎక్కువ రోజులు కేటాయించే వీలు కుదరట్లేదు. దీంతో సినిమా పూర్తి కావడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది.

కొంత కాలంగా ‘హరిహర వీరమల్లు’ సోషల్ మీడియా జనాలకు ఒక ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయింది. తాజాగా ‘అమేజాన్ ప్రైమ్’ వాళ్లు ముంబయిలో నిర్వహించిన కార్యక్రమంలో ‘హరిహర వీరమల్లు’ పోస్ట్ రిలీజ్ డిజిటల్ హక్కులు తమవే అని ప్రకటించారు.

థియేట్రికల్ రిలీజ్ తర్వాత ‘హరిహర వీరమల్లు’ ప్రైమ్‌లో రిలీజవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే.. దాని మీద కూడా నెటిజన్లు కామెడీ చేస్తున్నారు. ఎప్పుడు పూర్తవుతుందో.. థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందో తెలియని సినిమా డిజిటల్ హక్కులు కొని డిజిటల్ రిలీజ్ గురించి ప్రకటన ఇవ్వడమా అంటూ ప్రైమ్ వాళ్ల మీద పంచులు వేస్తున్నారు.

ఐతే ఈ సినిమా విషయంలో పవన్ అభిమానుల అసంతృప్తి, సోషల్ మీడియా జనాల ట్రోలింగ్ గురించి తెలిసి కూడా.. ఆ చిత్ర బృందం ధైర్యంగా అమేజాన్ మీట్‌కు హాజరై.. స్టేజ్ మీద నిలబడింది. సినిమా గురించి కాన్ఫిడెంట్‌గా మాట్లాడింది. ఈ సినిమాను ఎప్పడెప్పుడు ప్రేక్షకులకు చూపించాలా అని ఎదురు చూస్తున్నట్లు క్రిష్ చెబితే.. నిర్మాత రత్నం మాట్లాడుతూ ఎన్నో భారీ చిత్రాలు తీసిన తనకు కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ మూవీ అని, ఇది చరిత్ర సృష్టిస్తుందని అన్నాడు. ఇదే స్పిరిట్‌తో పవన్ అందుబాటులోకి రాగానే వీలైనంత సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.