సందీప్ కిషన్ తీసుకుంది చిరంజీవి కథే కానీ

ఇటీవలే ఊరిపేరు భైరవకోనతో డీసెంట్ సక్సెస్ అందుకున్న సందీప్ కిషన్ త్వరలో దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ దీనికి కథను అందించాడు. అయితే ఇది గతంలో కళ్యాణ్ కృష్ణ కోసం చిరంజీవికి ఇచ్చిన కథేననే ప్రచారం ముందు నుంచి ఉంది. దానికి నిర్మాత రాజేష్ దండా స్పష్టత ఇచ్చారు. ఇది మలయాళం బ్రో డాడీకి రీమేకనే వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని, పూర్తిగా స్ట్రెయిట్ సబ్జెక్టుతో నిర్మిస్తున్న సినిమాని కుండబద్దలు కొట్టారు.

చిరంజీవి దగ్గరికి వెళ్లిన స్టోరీనే అయినప్పటికీ కొత్త వెర్షన్ రాసుకున్నామని పూర్తిగా వేరే ఫ్లేవర్ లో ఉంటుందని అన్నారు. మ్యాటర్ ఇంకొంచెం బెటర్ గా అర్థం కావాలంటే కొంచెం వెనక్కు వెళ్ళాలి. ప్రసన్నకుమార్ మొదట రాసుకున్న వెర్షన్ లో ఒక సీనియర్ స్టార్, ఒక యూత్ హీరో అవసరం. దానికి అనుగుణంగానే మెగాస్టార్ కాంబోలో సిద్దు జొన్నలగడ్డ లేదా శర్వానంద్ తో ప్లాన్ చేద్దామనుకున్నారు. భోళా శంకర్ తర్వాత చిరు మనసు మారిపోవడంతో డ్రాప్ చేసుకున్నారు. కానీ కంటెంట్ ఉన్న సబ్జెక్టు కావడంతో ప్రసన్న, త్రినాథరావు నక్కిన కలిసి కీలక మార్పులు చేసుకున్నారు.

ఇప్పుడు రావు రమేష్, సందీప్ కిషన్ కలయికలో దీన్ని అందించబోతున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిరంజీవినే తొలుత మెప్పించిన కథ కాబట్టి ఖచ్చితంగా బలమైన పాయింట్ ఉంటుంది. ఒకవేళ భోళా ఫలితం సానుకూలంగా వచ్చి ఉంటే ఖచ్చితంగా చేసేవారేమో. కానీ జరిగింది వేరు. దీంతో ఇది కాస్తా సందీప్ కిషన్ చేతికి వచ్చింది. సినిమా చూపిస్తా మావా, నేను లోకల్ తరహాలో మాస్ క్లాస్ రెండు ఎంటర్ టైన్మెంట్స్ మిక్స్ చేసిన తీరులో ఉంటుందట. ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న త్రినాథరావు నక్కినకు దీని సక్సెస్ కీలకం.