‘ఆర్ఆర్ఆర్’పై శ్రియ క్లారిటీ


‘బాహుబలి’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా.. తారక్‌కు జోడీగా ఒలీవియా అనే విదేశీ నటి, చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ ఎంపికైన సంగతి తెలిసిందే.

ఇందులో కథను మలుపు తిప్పే ఓ కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటిస్తున్నాడు. తమిళ నటుడు సముద్రఖని సైతం ఒక ముఖ్య పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వీరికి శ్రియ కూడా తోడవుతున్నట్లు గత ఏడాది వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని ఆ తర్వాత శ్రియనే ధ్రువీకరించింది కూడా. ఐతే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించకుండా.. శ్రియ ఈ విషయాన్ని వెల్లడించడంపై రాజమౌళి సీరియస్ అయినట్లు వార్తలొచ్చాయి. ఇంకోసారి మీడియాతో మాట్లాడొద్దని ఆమెకు ఆదేశాలు జారీ చేసినట్లు కూడా చెప్పుకున్నారు.

కానీ శ్రియ మరోసారి ‘ఆర్ఆర్ఆర్’ గురించి మాట్లాడటం విశేషం. శనివారం శ్రియ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో ‘ఆర్ఆర్ఆర్’లో తన పాత్ర గురించి మాట్లాడింది. తనకు హీరోలు ఎన్టీఆర్, చరణ్‌లతో సన్నివేశాలు లేవన్న విషయాన్ని ఆమె వెల్లడించడం విశేషం. ‘‘ఆర్ఆర్ఆర్‌లో నాది చిన్న పాత్రే. అయినప్పటికీ ‘ఛత్రపతి’ తర్వాత రాజమౌళి గారితో మరోసారి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే అజయ్ దేవగణ్ గారితో మరోసారి నటించడమూ ఆనందమే. ఆయన చాలా మర్యాదపూర్వకమైన మనిషి. కానీ ఎన్టీఆర్, చరణ్‌లతో నాకు సన్నివేశాలు లేకపోవడం కొంచెం బాధేస్తోంది. అయితే వాళ్ల పాత్రలు సినిమాలో అద్భుతంగా ఉండబోతున్నాయని మాత్రం చెప్పగలను’’ అని శ్రియ అంది.

‘ఆర్ఆర్ఆర్’లో శ్రియ పాత్రకు సంబంధించి చిత్రీకరణ ఇంకా మిగిలి ఉందని సమాచారం. ఇదిలా ఉండగా శ్రియ ప్రధాన పాత్రలో ‘గమనం’ అనే ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే.