విశ్వంభర తారాగణంలో కొత్త మెరుపులు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. దర్శకుడు వశిష్ట పక్కా ప్లానింగ్ తో వేసుకున్న ప్రణాళిక వల్ల ఎలాంటి బ్రేకులు పడటం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతి జనవరి 10 విడుదలలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని టీమ్ నుంచి వస్తున్న రిపోర్ట్. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియురాలిగా, దేవతగా డ్యూయల్ రోల్ చేస్తోందనే టాక్ ఉంది కానీ అధికారికంగా తెలిసే ఛాన్స్ ఇప్పట్లో లేదు కాబట్టి నిజమైతే బాగుండని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇక క్యాస్టింగ్ కు సంబంధించిన కొత్త ఆకర్షణలు చాలా తోడవుతున్నాయని తెలిసింది. ఆల్రెడీ సురభి, ఈషా చావ్లాలు షూట్ లో పాల్గొంటున్నారు. ఆషిక రంగనాథ్ గురించి స్పష్టమైన సమాచారం లేదు. వీళ్ళు కాకుండా యూత్ హీరోలు రాజ్ తరుణ్, నవీన్ చంద్రలను ప్రత్యేక పాత్రల కోసం తీసుకున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్షవర్ధన్ లు కామెడీ భారం మోయగా మెయిన్ విలన్ గా కృనాల్ కపూర్ తో పాటు రావు రమేష్ కీలక భూమిక పోషిస్తారు. మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్ ఉంటారనే వార్తకు ఇంకా సరైన ధృవీకరణ రావాల్సి ఉంది.

ఈ లెక్కన వశిష్ట వేసిన ప్లాన్ మాములు లేదు. ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఒక పాటని ఇప్పటికే చిత్రీకరించారు. రామోజీ ఫిలిం సిటీలో మరికొన్ని భారీ సెట్ల నిర్మాణం జరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ కు చాలా ప్రాధాన్యం ఉన్న విశ్వంభరను గొప్పగా తీర్చిద్దిదేందుకు టీమ్ శర్వశక్తులు ఒడ్డుతోందట. రెండు  వందల కోట్ల బడ్జెటనే టాక్ వినిపిస్తోంది కానీ బృందం సభ్యులు ఖర్చు గురించి మాట్లాడ్డం లేదు. వేసవిలోగా షూట్ పూర్తి చేసి ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కే కేటాయిస్తారని తెలిసింది. భోళా శంకర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ సినిమా వదులుకుని మరీ విశ్వంభరకు ఓటేసిన మెగాస్టార్ తర్వాత హరీష్ శంకర్ తో చేసే ఛాన్స్ ఉంది.