నేనే చచ్చిపోతా.. ఆత్మహత్యకు ముందు శ్రావణి

Tv Actress Sravani

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య వ్యవహారం రెండు రోజులుగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆమె బలవన్మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని స్పష్టమవుతోంది. తన కోసం సాయికృష్ణ, దేవరాజ్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు తీవ్ర స్థాయిలో గొడవ పడ్డట్లు తెలుస్తోంది. ఒకప్పుడు సాయికృష్ణతో ప్రేమలో ఉన్న శ్రావణి.. ఆ తర్వాత దేవరాజ్ వైపు ఆకర్షితురాలైందని, చనిపోవడానికి ముందు అతడితోనే ప్రేమలో ఉందని గత రెండు రోజుల్లో విడుదలైన ఆడియో, వీడియోలను బట్టి అర్థమవుతోంది. ఇద్దరి మధ్య నలిగిపోయిన ఆమె.. వీళ్లిద్దరి వల్లా వేధింపులు గురైనట్లు.. వాళ్ల చేతిలో దెబ్బలు కూడా తిన్నట్లు.. అలాగే కుటుంబ సభ్యులు సైతం ఆమెను కొట్టినట్లు పలు ఆధారాలను బట్టి పోలీసులు అంచనా వేస్తున్నారు.

తాజాగా శ్రావణి లైన్లో ఉండగా.. సాయికృష్ణ, దేవరాజ్ రెడ్డి కాన్ఫరెన్స్ కాల్‌లో ఒకరినొకరు తిట్టుకున్న ఆడియో ఒకటి బయటికి వచ్చింది. అందులో శ్రావణిని ఇబ్బంది పెడుతున్నావంటూ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారు. ఐతే దేవరాజ్ మాత్రం శ్రావణికి తానే కావాలని, తననే ఆమె ప్రేమిస్తోందని.. కావాలంటే ఈ విషయం శ్రావణినే అడగమని అన్నాడు. అతను అడిగితే.. శ్రావణి కూడా ఔను నిన్నే ప్రేమిస్తున్నా అని బదులిచ్చింది. మరి నిన్ను ప్రేమిస్తోందేమో శ్రావణిని అడిగి చూడు అని సాయిని దేవరాజ్ అంటే.. ఇప్పుడు నీ మాయ మాటలు నమ్మి, నా మీద కోపంతో ఉన్న ఆమె నన్నెలా ప్రేమిస్తుందని అంటుంది అని అతను ప్రశ్నించాడు. శ్రావణికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు పెట్టుకుని ఆమెను దేవరాజ్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని సాయికృష్ణ ఆరోపించాడు. కాగా సాయినే శ్రావణి కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను ఇబ్బంది పెడుతున్నాడని దేవరాజ్ అన్నాడు. ఆమెను నువ్వు ఎందుకు కొట్టావ్ అని కూడా ప్రశ్నించాడు. ఇలా వీళ్లిద్దరూ తీవ్ర స్థాయిలో తిట్టుకుంటున్న దశలో.. శ్రావణి కలుగజేసుకుని.. మీరెందుకు గొడవ పడతారు, నేనే చచ్చిపోతా అంది. ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరి మానసిక వ్యధకు గురైన నేపథ్యంలోనే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది.