ఇంకా చల్లారని ఆదిపురుష్ మంటలు

ఆదిపురుష్ సినిమా రిలీజై తొమ్మిది నెలలు కావస్తోంది. ఇంకా ఆ సినిమా తాలూకు వివాదాలు చల్లారట్లేదు. దానిపై విమర్శలు ఆగట్లేదు. రామాయణం లాంటి ఎపిక్ స్టోరీని భ్రష్టు పట్టించారంటూ ఓం రౌత్ అండ్ టీం మీద రిలీజ్ టైంలో ఎంతగా విమర్శలు వచ్చాయో తెలిసిందే. ఎంత మామూలుగా తీసినా ప్రేక్షకులను మెప్పించే అవకాశమున్న కథను.. ఓం రౌత్ తెరపై ప్రెజెంట్ చేసిన తీరు జనాలకు కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. ముఖ్య పాత్రధారుల అవతారాలు, డైలాగులు, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తేడా కొట్టేశాయి ‘ఆదిపురుష్’లో.

ఓవైపు రామ పారాయణం జరిగిన ప్రతి చోటుకీ హనుమంతుడు వస్తాడంటూ థియేటర్లలో ఒక సీట్ ఖాళీగా వదిలిపెట్టడం లాంటి ప్రమోషన్ చేసి.. అసలిది రామాయణ కథే కాదు అంటూ ‘ఆదిపురుష్’ రైటర్ పేర్కొనడం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. హనుమాన్ లాంటి సినిమాల్లో వీఎఫెక్స్, హనుమంతుడి పాత్ర ప్రెజెంటేషన్ చూశాక ‘ఆదిపురుష్’ టీం మీద జనాలకు మరింత ఆగ్రహం కలిగింది.

ఇలా సందర్భం వచ్చిన ప్రతిసారీ ‘ఆదిపురుష్’ టీంకు విమర్శల సెగ తప్పట్లేదు. తాజాగా సీనియర్ నటుడు విందు దారాసింగ్.. ‘ఆదిపురుష్’ టీం మీద ఓ ఇంటర్వ్యూలో విమర్శలు గుప్పించాడు. ‘ఆదిపురుష్’ను అతి పెద్ద మిస్టేక్‌గా పేర్కొన్న విందు.. ఒక గొప్ప కథ విషయంలో ఎంతో బాధ్యతగా ఉండాల్సిన టీం తామేదో అద్భుతం చేస్తున్నామన్న భావనతో బాధ్యతారాహిత్యంగా ఈ సినిమా తీసిందని అతను విమర్శించాడు.

‘ఆదిపురుష్’లో ముఖ్య పాత్రలు చేసిన ఆర్టిస్టులందరూ తనకు తెలుసని.. వాళ్లలో చాలామంది ఇందులోని డైలాగుల విషయంలో అభ్యంతరాలు చెప్పారని విందు వెల్లడించాడు. షూటింగ్ స్పాట్లో డైలాగులు మార్చాలని దర్శక నిర్మాతలకు చెప్పినా.. వాళ్లు ఆ సూచనల్ని బేఖాతరు చేశారన్నాడు. తాము అసాధారణంగా ఏదో చేస్తున్నామన్న ఫీలింగ్‌తో టీం ఉందని.. రౌత్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఇలాంటి సినిమా తీయడం బాధాకరమని విందు అన్నాడు.