ప్యాన్ ఇండియా రామాయణంకి మొదటి షాక్

వందల కోట్ల బడ్జెట్ తో ఇండియాలో అత్యంత ఖరీదైన సినిమాగా ప్లాన్ చేసిన మూడు భాగాల రామాయణంకి ఆదిలోనే షాక్ తగిలిందని లేటెస్ట్ ముంబై అప్డేట్. ముందు విభీషణుడిగా ఒప్పుకున్న విజయ్ సేతుపతి డేట్ల కారణంగా తప్పుకున్నట్టు తెలిసింది. భారీ డేట్లు ఇచ్చే పరిస్థితి లేనందు వల్ల తనను బదులు ఇంకొకరిని చూసుకోవాలని దర్శకుడు కం నిర్మాత నితీష్ తివారికి చెప్పినట్టు సమాచారం. ఇప్పుడా ప్లేస్ లో క్యారెక్టర్ ఆర్టిస్టు హర్మన్ బవేజా వచ్చి చేరినట్టు తెలిసింది. వచ్చే నెల లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకోబోతున్న రామాయణం కోసం క్యాస్టింగ్ వర్క్ షాప్ జరుగుతోంది.

చాలా డీటెయిల్స్ ని టీమ్ రహస్యంగా ఉంచుతోంది. రన్బీర్ కపూర్ ని మాత్రమే కన్ఫర్మ్ చేయగా సీతగా చేయబోయే సాయిపల్లవిని మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రావణుడిగా నటించేందుకు యష్ కి నూటా యాభై కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారనే వార్త మీడియా వర్గాల్లో తిరుగుతున్నా యూనిట్ మాత్రం మౌనంగానే ఉంది. ఉన్నాడనే విషయాన్ని సైతం ధృవీకరించడం లేదు. మొత్తం మూడు పార్ట్స్ కావడంతో పెద్ద ఎత్తున ఆర్టిస్టుల కాల్ షీట్స్ అవసరం కావడం నితీష్ తివారికి సమస్యగా మారింది. దీంట్లో నటించాలంటే వేరేవి వదులుకునే పరిస్థితి తలెత్తింది.

తరాల తరబడి గొప్పగా చెప్పుకునే ఈ రామాయణాన్ని తీస్తానని నితీష్ తివారి నొక్కి చెబుతున్నాడు. వచ్చే నెల శ్రీరామనవి సందర్భంగా అయోధ్యలో మొదలుపెట్టేలా ప్రణాళిక జరుగుతోంది. త్వరలో ఒక ప్రెస్ మీట్ ద్వారా అన్నీ వెల్లడించబోతున్నారు. వేరొకరు మళ్ళీ ఇదే కథ తో సినిమా చేసే అవసరం రానంత అద్భుతంగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంటున్నారు. 2026లో ఫస్ట్ పార్ట్ రిలీజయ్యేలా ప్లానింగ్ జరుగుతోంది. హిందీ, తమిళ ఆర్టిస్టులను భారీగా తీసుకుంటున్న నితీష్ తివారి తెలుగు నుంచి లక్ష్మణుడిగా నవీన్ పోలిశెట్టిని ట్రై చేస్తున్నారు. చిచోరేకు కలిసి చేశారు కాబట్టి ఓకే కావొచ్చని టాక్.