శ్రియ ఈజ్ బ్యాక్

శ్రియసరన్ కథానాయికగా అరంగేట్రం చేసి దశాబ్దంన్నర దాటిపోయింది. ఇప్పటికీ ఆమె లైమ్ లైట్లో ఉండటం, ‘కథానాయిక’గానే కొనసాగుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. శ్రియ పనైపోయింది అనుకున్నాక కూడా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘పైసా వసూల్’ లాంటి పెద్ద చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఆ తర్వాత మాత్రం ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు లేవు. అలాగని ఆమె సినిమాలు మాత్రం మానేయట్లేదు.

పెళ్లి చేసుకున్నప్పటికీ సినిమాలకు టాటా చెప్పే ఉద్దేశమే శ్రియకు ఉన్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలోనే ఆమెకు ‘ఆర్ఆర్ఆర్’లో ఒక పాత్ర చేసే అవకాశం దక్కినట్లు వార్తలొచ్చాయి. అదెంత వరకు నిజమో కానీ.. తాజాగా శ్రియ ప్రధాన పాత్రలో ఓ బహు భాషా చిత్రం మొదలైంది. ఆ సినిమా పేరు.. గమనం.

సుజనా రావు అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించబోయే ఈ చిత్రంలో శ్రియదే లీడ్ రోల్. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. పూర్తిగా శ్రియ ఇమేజ్‌ను, ఆమె నటనా సామర్థ్యాన్ని నమ్ముకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంతకుముందు ‘పవిత్ర’ అనే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో శ్రియ నటించింది. అదంత మంచి ఫలితాన్నివ్వలేదు. దానికి ముందు, తర్వాత శ్రియ లేడీ ఓరియెంటెడ్ సినిమాల జోలికి వెళ్లలేదు.

ఇప్పుడు ఆమె ఎంచుకున్న సినిమా ప్రత్యేకంగానే కనిపిస్తోంది. ఒక మధ్య తరగతి మహిళ కథలా అనిపిస్తోందిది. శ్రియ పెద్దగా మేకప్ లేకుండా సామాన్యమైన మహిళలా దర్శనమిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ భాషలన్నింట్లో శ్రియ ప్రేక్షకులకు పరిచయమే. ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చనుండటం విశేషం.

క్రిష్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ‘గమనం’కు ఛాయాగ్రహణం సమకూర్చడంతో పాటు నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించనున్నాడు. స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నాడు.