రెండో బ్లాక్ ఫ్రైడే – థియేటర్లు విలవిలా

వరసగా రెండో శుక్రవారం మార్చి ఒకటి టాలీవుడ్ బాక్సాఫీస్ కు తీవ్ర నిరాశ మిగిల్చింది. థియేటర్లలో కనీస జనం లేక చాలా షోలు క్యాన్సిల్ చేసుకుంటూ ఎగ్జిబిటర్లు అలో లక్ష్మణా అంటూ కేకలు పెట్టాల్సిన పరిస్థితి. వీళ్ళకే ఇలా ఉంటే ఇక పార్కింగ్, క్యాంటీన్ ల గురించి చెప్పాల్సిన పని లేదు. మొన్న ఫ్రైడే వచ్చిన వాటిలో ఆపరేషన్ వాలెంటైన్ టాక్ ఎలా ఉన్నా మెగా హీరో కాబట్టి కాస్త డీసెంట్ రెవెన్యూ తెస్తుందనుకుంటే ఆదివారం సైతం డెఫిషిట్లు నమోదు చేయడం ఎంత డిజాస్టరో చెప్పకనే చెబుతుంది. వెన్నెల కిషోర్ చారి 111 ఆడియన్స్ తిరస్కారానికి గురయ్యింది.

వర్మ హడావిడి చేసిన వ్యూహం నవ్వులపాలు కాక తప్పలేదు. స్పూఫ్ తరహాలో తీసిన పొలిటికల్ డ్రామా దానికి తగ్గట్టే అత్తెసరు ఫిగర్లు నమోదు చేస్తోంది. భూతద్దం భాస్కర్ నారాయణకు వీటితో పోల్చుకుంటే ఓ పాతిక శాతం బెటర్ టాక్ వినిపించినా అది కలెక్షన్లగా మారడం లేదు. భారీగా టికెట్లు కొని చూసే స్థాయిలో లేదనే మాట ప్రభావం చూపిస్తోంది. మరో రెండు మూడు చిన్న సినిమాలను పట్టించుకున్న నాథుడు లేదు. ఇదే సీన్ నిన్న వారం ఫిబ్రవరి 23 చూశాం. సుందరం మాస్టర్, సిద్దార్థ్ రాయ్, భ్రమ యుగం, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నీ పోటీపడి టపా కట్టేశాయి.

చాలా చోట్ల ఊరిపేరు భైరవకోననే మంచి వసూళ్లు నమోదు చేయడం గమనార్హం. మిక్స్డ్ టాక్ తోనూ ఉన్నవాటిలో ఇదే చాలా బెటరరే అభిప్రాయం పబ్లిక్ లో ఉండటం సందీప్ కిషన్ టీమ్ కు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. దాదాపు బయ్యర్లని బ్రేక్ ఈవెన్ దాటించి ఫిబ్రవరిలో డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇలా వరసగా పధ్నాలుగు రోజుల పాటు సరైన సినిమా లేక అల్లాడిపోతున్నాయని బయ్యర్లు ఆవేదన చెందడంలో న్యాయం ఉంది. రాబోయే గామి, భీమా, ప్రేమలు టికెట్ కౌంటర్లకు ఊపిరినివ్వాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. వీటికి ప్రీ రిలీజ్ టాక్ పాజిటివ్ గా ఉండటం రిలీఫ్ ఇస్తోంది.