25 రోజుల దూరంలో టిల్లు స్క్వేర్ పరుగులు

సిద్దు జొన్నలగడ్డ మోస్ట్ వాంటెడ్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ విడుదలకు కేవలం 25 రోజులే ఉంది. మార్చి 29 థియేటర్లలో అడుగు పెట్టనున్న సంగతి తెలిసిందే. నిర్మాతలు గత నెలే ట్రైలర్ లాంచ్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చారు. కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉండటంతో పాటు అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ షో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. అయితే రిలీజ్ ఇంత దగ్గరగా ఉన్నా ప్రమోషన్లలో ఇంకా వేగం కనిపించడం లేదు. మాములుగా సితార సంస్థ నుంచి వచ్చే సినిమాలు పెద్దవైనా చిన్నవైనా పబ్లిసిటీ పరంగా కనీసం నాలుగైదు వారల ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటారు.

కానీ టిల్లు స్క్వేర్ విషయంలో అంత దూకుడు కనిపించడం లేదు. కారణం ఏంటయ్యాని ఆరా తీస్తే కీలకమైన పనులు కొన్ని పెండింగ్ ఉండిపోవడంతో వాటిని ఆఘమేఘాల మీద పూర్తి చేసే పనిలో దర్శకుడు మల్లిక్ రామ్ బృందం బిజీగా ఉండటంతో ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారట. షూటింగ్ కు సంబంధించిన చిన్న ప్యాచ్ వర్క్ సైతం ఈ వారంలో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారట. ఈ సినిమా కోసమే తెలుసు కదా, జాక్ నుంచి బ్రేక్ తీసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఏప్రిల్ మొదటి వారం దాకా దీని ప్రమోషన్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. రంగంలో దిగడమే ఆలస్యం.

పోటీ పరంగా టిల్లు స్క్వేర్ కు బాక్సాఫీస్ వద్ద కొన్ని రిస్కులున్నాయి. వాటిలో మొదటిది అదే రోజు హాలీవుడ్ క్రేజీ మూవీ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ భారీ ఎత్తున రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది. పిల్లలు, యూత్ లో దీని మీద మాములు హైప్ లేదు. వారం తిరక్కుండానే విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ ని నిర్మాత దిల్ రాజు గారు పెద్ద రేంజ్ లో దించేస్తారు. వీటిని కాచుకోవడం సిద్దుకి సవాలే. మళ్ళీ వాయిదా లాంటి షాక్ ఇవ్వరు కదానే అనుమానం ఫ్యాన్స్ లో తలెత్తుతోంది కానీ సితార టీమ్ మాత్రం అదేమీ లేదు చెప్పిన ప్రకారమే వస్తామని హామీ ఇస్తోంది. చూద్దాం.