స్టార్ క్యామియోలతో సంక్రాంతికి వస్తున్నాం

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ ని రిజిస్టర్ చేసినట్టు గత వారమే లీక్ వచ్చింది. యూనిట్ అధికారికంగా ధృవీకరించకపోయినా ఫిలిం ఛాంబర్ వర్గాల నుంచి అందిన న్యూస్ విశ్వసనీయంగానే ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న టీమ్ చాలా క్రేజీ క్యాస్టింగ్ కి దీని కోసం సెట్ చేయబోతున్నట్టు తెలిసింది. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. కథ విని అంగీకారం తెలిపిందని, అగ్రిమెంట్ అయ్యాక టీమ్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా ఈ మూవీలో మల్టీ స్టారర్ క్యామియోలు ఉండొచ్చని లేటెస్ట్ అప్డేట్. నందమూరి బాలకృష్ణ, రవితేజలతో కొన్ని నిముషాలు కనిపించే ప్రత్యేక పాత్రలు డిజైన్ చేసినట్టు వినికిడి. అనిల్ రావిపూడితో రాజా ది గ్రేట్ నుంచి మాస్ మహారాజాకు బాండింగ్ ఉంది. వరస డిజాస్టర్లలో ఉన్నప్పుడు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడిగా ఇతని మీద రవితేజకు ప్రత్యేక అభిమానముంది. ఇక భగవంత్ కేసరిలో తన వయసుకి తగ్గ అద్భుతమైన క్యరెక్టర్ ఇచ్చి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టేందుకు ఉపయోగపడిన డైరెక్టర్ గా బాలయ్యకూ అనిల్ రావిపూడితో అలాంటి బంధం ఉంది.

సో ఇది నిజమయ్యే అవకాశాలు కొట్టి పారేయలేం. 2025 సంక్రాంతి బరిలో చిరంజీవి విశ్వంభరతో పోటీగా నిలిపేందుకు గ్రౌండ్ సిద్ధమవుతోంది. పెద్ద సినిమాలు రెండు మూడున్నా ఈజీగా వర్కౌట్ అయ్యే సీజన్ కాబట్టి నిర్మాత దిల్ రాజు ఆ అవకాశాన్ని వదలకూడదని డిసైడ్ అయ్యారు. గత ఏడాది సంక్రాంతి మిస్ అయ్యింది. గుంటూరు కారం పంపిణి చేసినా పూర్తి స్థాయి సంతృప్తి దక్కలేదు. అంతకు ముందు వారసుడుతో తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. క్వాలిటీ తగ్గకుండా వేగంగా తీయడంలో పేరున్న అనిల్ రావిపూడికి ఎఫ్2, ఎఫ్3 తర్వాత వెంకీతో ఇది మూడో చిత్రం.