క్రేజీ కాంబోలు వెతుకుతున్న రాజమౌళి

మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసుకున్న ప్యాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన పనులు బయటికి ఎక్కువ లీక్ కాకుండా చకచకా జరిగిపోతున్నాయి. త్వరలో క్యాస్ట్ అండ్ క్రూతో భారీ వర్క్ షాప్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నాగార్జున ఒక కీలక పాత్ర చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆల్రెడీ నెరేషన్ అయిపోయిందని, నాగ్ అంగీకారం వచ్చేసిందని వినికిడి. మహేష్ కి జోడిగా చెల్సియా ఇస్లాన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కాగా నాగార్జున సరసన కల్కి భామ దీపికా పదుకునేని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ డీల్ ఇంకా తుదిదశకు చేరుకోలేదట.

ఒకవేళ ఓకే అయితే కాంబినేషన్ మరింత క్రేజీగా మారుతుంది. ఆర్ఆర్ఆర్ కు ఇదే తరహాలో అలియా భట్, అజయ్ దేవగన్ లను తీసుకొచ్చిన జక్కన్న దానికి తగ్గట్టే మంచి ఫలితం అందుకున్నాడు. తక్కువ నిడివి ఉన్న పాత్రలైనా సరే భారీ రెమ్యునరేషన్లు ఇచ్చి ఒప్పించాడు. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని రిపీట్ చేయచ్చు. వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో స్క్రీన్ పంచుకున్న మహేష్ ఇప్పుడు నాగ్ తో కలిసి తెరమీద కనిపిస్తే అంతకంటే అభిమానులకు కావాల్సింది ఏముంటుంది. ఇంకొన్ని రోజుల పాటు ఇలాంటి డీటెయిల్స్ ఏవీ అఫీషియల్ చేయబోరు.

అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ ఎప్పుడు ఉండాలనే ముహూర్తం ఇంకా ఫిక్స్ చేయలేదని తెలిసింది. ఉగాది పండగకు చేద్దామా లేక ఇంకో నెల ఆగి ఏప్రిల్ లో ప్రకటిద్దామా అనే ఆలోచన కొలిక్కి రాలేదట. 2026లో విడుదల చేయాలనే సంకల్పంతో పనులు చేస్తున్నారు కానీ ఇది పూర్తిగా పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కీరవాణి సంగీతం సమకూర్చబోయే ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ కు మహారాజా అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చినా యూనిట్ వర్గాలు మాత్రం సైలెంట్ గా ఉంటున్నాయి. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కెఎల్ నారాయణ ఈ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.