రియా కుటుంబం అంత పనీ చేసేలా ఉంది

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది అతడి మాజీ ప్రేయసి రియా చక్రవర్తి. ఆమె వల్లే అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని, అతడి డబ్బుల్ని ఆమె వాడుకుందని ముందు ఆరోపణలు వచ్చాయి. ఇందులో కుట్ర కోణం గురించి కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఐతే ఈ విషయాలపై పోలీసులు విచారణ జరిపితే సరైన ఆధారాలేమీ దొరికినట్లు లేవు.

ఐతే ఈ కేసును విచారించే క్రమంలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. సుశాంత్, రియా కలిసి డ్రగ్స్ తీసుకునేవాళ్లని వెల్లడైంది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. రియాను కొన్ని రోజుల పాటు విచారించడమే కాక.. ఆమెను అరెస్టు కూడా చేసింది. ఈ కేసులో ఆమెకు బెయిల్ కూడా దొరకలేదు. ఈ నేపథ్యంలో కేసు కొత్త మలుపు తిరిగింది.

ఇన్నాళ్లూ సుశాంత్ విషయంలో సౌమ్యంగానే మాట్లాడుతూ వచ్చారు రియా, ఆమె కుటుంబ సభ్యులు. కానీ డ్రగ్స్ కేసు రియా మెడకు చుట్టుకోవడంతో వాళ్ల ఆలోచన మారినట్లు స్పష్టమవుతోంది. చనిపోయిన వ్యక్తి అని చూడకుండా అతడి గురించి ఎలా పడితే అలా మాట్లాడేస్తోంది రియా కుటుంబం. రియా కొంప మునిగే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో సుశాంత్ గురించి ముందు వెనుకా ఆలోచించేలా కనిపించట్లేదు. ఆమెను బయటపడేసేందుకు ఎంత వరకైనా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే రియా లాయర్.. సుశాంత్ ఒక డ్రగ్ అడిక్ట్ అంటూ వ్యాఖ్యానించారు.

ఇప్పుడు రియా తండ్రి ఇంద్రజిత్ ముఖర్జీ లైన్లోకి వచ్చారు. సుశాంత్ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో అసౌకర్యాన్ని కలిగించే సత్యం దాగి ఉంది. సుశాంత్‌ ప్రాణాలతో ఉండి ఉంటే.. డ్రగ్స్‌ తీసుకున్న ప్రధాన నిందితుడిగా, వాటికి డబ్బులు ఇచ్చి కొన్న వ్యక్తిగా ఉండేవాడు. సుశాంత్‌కు న్యాయం జరగాలి అంటూ ఇంత వరకు తెచ్చారు. తన ప్రియుడి వల్ల రియా ఇటువంటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తోంది. రియా అమాయకురాలు’’ అన్నారు. దీన్ని బట్టి చూస్తే రియాను కాపాడేందుకు ఆమె కుటుంబం సుశాంత్ గురించి ఎన్ని మాటలైనా అనడానికి, ఆరోపణలైనా చేయడానికి వెనుకాడేలా లేదని స్పష్టమవుతోంది.