మహేష్ మెచ్చుకున్న ‘పోచర్’లో ఏముంది

మాములుగా సినిమాలు చూసేందుకే స్టార్ హీరోలకు టైం ఉండదు. అలాంటిది వెబ్ సిరీస్ లంటే మహా కష్టం. గుంటూరు కారం తర్వాత రాజమౌళి సెట్లోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్న మహేష్ బాబుకి సమయం దొరికినట్టు ఉంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన పోచర్ మీద లుక్కేశాడు. అక్కడితో ఆగలేదు. దాన్ని ప్రత్యేకంగా మెచ్చుకుంటూ ఇన్స్ టా స్టోరీని పెట్టడంతో ఒక్కసారిగా అభిమానుల దృష్టి దాని మీదకు వెళ్ళింది. ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ కు సహ నిర్మాతగా ఇది మొదటి డిజిటల్ వెంచర్. అందుకే పోయిన గురువారం సెలబ్రిటీలకు ప్రీమియర్ వేశారు.

ఇది ఏనుగు దంతాలను దోచుకునే మాఫియా కథ. కేరళ రాష్ట్రం మలయత్తు ప్రాంతంలో ఉండే అడవి స్మగ్లింగ్ కి నెలవు. రేంజ్ ఆఫీసర్ గా పని చేసే మాల(నిమిష విజయన్)కు పద్దెనిమిది ఏనుగులు హత్యకు గురైన కేసుని అప్పగిస్తారు. డిపార్ట్ మెంట్ వ్యక్తే దొంగలకు సహకరించి అప్రూవర్ గా మారిపోతాడు. విచారణ చేసి హంతకులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన అలెన్(రోషన్ మాధ్యు) బృందంలో మాలకు చోటు దక్కుతుంది. మూలాలు తవ్వే కొద్దీ లింకులు ఎక్కడో ఢిల్లీ దాకా వెళ్తాయి. దీని వెనుక ఉన్నది మోరిస్, రాజ్ అని తెలుస్తుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.

మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్న పోచర్ సుదీర్ఘంగా సాగుతుంది. సీరియస్ నేపథ్యంలో సాగే ఈ ఫారెస్ట్ థ్రిల్లర్ లో తగినన్ని మలుపులు, పాత్రల మధ్య సంఘర్షణ అవసరమైన మోతాదులో దర్శకుడు రిచి మెహతా దట్టించినా డ్రామా పాలు ఎక్కువ కావడంతో కొంత ల్యాగ్ ఫీలింగ్ కలుగుతుంది. అయితే కాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యాక అవసరం లేని చోట ఫార్వార్డ్ కి పని చెప్పుకుంటూ పోతే పోచర్ ఓ మోస్తరుగా పర్వాలేదనే భావన వస్తుంది. ఎప్పుడూ సైకో మర్డర్ల చుట్టూ తిరిగే సిరీస్ ల మధ్య ఈ పోచర్ డిఫరెంట్ ఫీలింగ్ కలిగిస్తుంది. కాలక్షేపం కాక సమయం తగినంత ఉంటే పోచర్ ని ట్రై చేయొచ్చు.