తండ్రి చెప్పేశాడు.. కూతురు దాచిపెడుతోంది

ఒక‌ప్పుడు సౌత్ ఇండ‌స్ట్రీని ఏలింది అందాల తార‌ శ్రీదేవి. ఇప్పుడు ఆమె త‌న‌యురాలు జాన్వి క‌పూర్ కూడా ఆ దిశ‌గానే అడుగులు వేస్తున్న సంకేతాలు క‌నిపించాయి. ముందుగా హిందీ సినిమాల్లోనే అరంగేట్రం చేసి పేరు సంపాదించిన ఈ అమ్మాయి.. దేవ‌ర‌తో ద‌క్షిణాది సినిమాలో అడుగు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న బుచ్చిబాబు సానా సినిమాలో న‌టించ‌బోతున్న‌ట్లు కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇటీవ‌లే జాన్వి తండ్రి బోనీ క‌పూర్ ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు. చ‌ర‌ణ్ సినిమాతో పాటు త‌మిళంలో సూర్య‌కు జోడీగానూ జాన్వి న‌టించ‌బోతున్న‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఈ వార్త కాసేప‌టికే వైర‌ల్ అయిపోయింది. చర‌ణ్ సినిమాకు ఎట్ట‌కేల‌కు హీరోయిన్ ఖ‌రారైంద‌ని మెగా ఫ్యాన్స్ ఆ వార్త‌ను సోష‌ల్ మీడియాలో బాగా షేర్ చేశారు.

ఐతే తండ్రీ క‌న్ఫ‌మ్ చేసిన విష‌యాన్ని జాన్వి మాత్రం ధ్రువీక‌రించ‌ట్లేదు. టీం అధికారికంగా చెప్ప‌కుండా తమ కుటుంబం ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌డం ఇష్టం లేదో ఏమో.. ఆమె తండ్రి ప్ర‌క‌ట‌న‌పై స‌మాధానం దాట వేసింది. ఇటీవ‌ల మా నాన్న నా త‌ర్వాతి సినిమాల విష‌య‌మై నాతో స‌హా ఎవ‌రినీ సంప్ర‌దించ‌కుండా స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏ సినిమాల్లో న‌టిస్తున్నాన‌ని ఆయన చెప్పారో వాటి గురించి నేను మాట్లాడ‌లేను.

ప్ర‌స్తుతానికి నేను దేవ‌ర‌, మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి, ఉల‌జ్ సినిమాల్లో న‌టిస్తున్నా అని జాన్వి వెల్ల‌డించింది. త‌న‌కు ద‌క్షిణాది సినిమాల‌పై ప్ర‌త్యేక ఆస‌క్తి ఉన్న‌ట్లు ఈ సంద‌ర్భంగా జాన్వి చెప్పింది. చిన్న‌పుడు ఇంద్ర సినిమాను టీవీలో చూడ‌డం త‌న‌కు ఇంకా గుర్తుంద‌ని.. ఇప్పుడు సౌత్ సినిమాల్లో న‌టిస్తుండ‌డంతో త‌న సొంత‌గ‌డ్డ‌కు తిరిగి వ‌చ్చిన ఫీలింగ్ క‌లుగుతోంద‌ని ఆమె పేర్కొంది.