కోట్లు మునిగిపోయినా సీక్వెల్ తీస్తున్నారు

2022లో వచ్చిన ది లెజెండ్ ని థియేటర్లో, ఓటిటిలో చూసినవాళ్లు ఎవరూ మర్చిపోలేరు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలైన ఈ కళాఖండం మీద ఎంత ట్రోలింగ్ జరిగిందో వివరించడం కష్టం. వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన శరవణన్ యాభై ఏళ్ళ వయసు దాటాక కేవలం స్క్రీన్ మీద కనిపించాలనే తాపత్రయంతో ది లెజెండ్ తీయించారు. అయితే ఏదో ఆషామాషీగా చుట్టేయలేదు. భారీ క్యాస్టింగ్ ని పెట్టుకుని 70 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారని చెన్నై టాక్ తిరిగింది. ఇంతా చేసి థియేట్రికల్ రైట్స్ ని డెఫిషిట్ తో 45 కోట్లకు స్వంతంగా రిలీజ్ చేశారు.

ఇంత చేసినా బొమ్మ భారీ డిజాస్టర్ అయ్యింది. జనాలు అయ్య బాబోయ్ అనేశారు. శరవణన్ ఎక్స్ ప్రెషన్ల గురించి జరిగిన కామెడీ అంతా ఇంతా కాదు. అయినా సరే ఆయన వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్రయిల్ షూట్ జరుగుతోంది. ధనుష్, శివ కార్తికేయన్ లాంటి స్టార్ హీరోలను డీల్ చేసిన దురై సెంథిల్ కుమార్ ని దర్శకుడిగా తీసుకున్నారు. రెమ్యునరేషన్ భారీగా ముట్టజెబుతున్నారు. ఇందులో కూడా శరవణన్ రకరకాల గెటప్స్ లో కనిపిస్తారట. యాక్షన్, సోషల్ మెసేజ్ తో పాటు కామెడీ కూడా ఉంటుందని సమాచారం.

దీని గురించి మనకెందుకు అంటే ఈ మాస్టర్ పీస్ ప్యాన్ ఇండియాలో వస్తుంది కాబట్టి. ఒక్క విషయంలో శరవణన్ ని మెచ్చుకోవాలి. ఎంత వందల కోట్లు ఉన్నా సరే ఇలా అయాచితంగా సినిమాల మీద ఖర్చు పెట్టే సాహసం అందరూ చేయరు. కానీ ఈయన మాత్రం నా రూటే వేరు అంటున్నారు. నటుడిగా ఎంత ట్రోల్ చేసినా ఒక వ్యాపారవేత్తగా మాత్రం శరవణన్ మోస్ట్ సక్సెస్ ఫుల్ మ్యాన్. తన సంస్థల్లో ఉద్యోగులు దేవుడిలా కొలుస్తారు. కాకపోతే యాక్టింగ్ పిచ్చి ఆయన్ని కేవలం బిజినెస్ కి పరిమితం చేయకుండా తెరదాకా లాకొచ్చింది. ఈసారి ఎలాంటి షాకులు ఇస్తారో చూడాలి.