అక్కినేని వారికి ఊపొచ్చింది

టాలీవుడ్లో ఓ కొత్త హీరో అరంగేట్రానికి అత్యధిక బడ్జెట్ పెట్టిన, అదే స్థాయిలో బిజినెస్ జరిగిన సినిమా ‘అఖిల్’. పసి పిల్లాడిగా ఉన్నపుడే ‘సిసింద్రీ’తో ఎక్కడ లేని క్రేజ్ తెచ్చుకున్న అఖిల్.. హీరోగా మారుతున్నాడనగానే మాంచి క్రేజ్ కనిపించింది. అతడి లుక్స్ కూడా అందరి దృష్టినీ ఆకర్షించాయి. హీరో కావడానికి ముందే అతడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తెరంగేట్రానికి ముందే జాతీయ స్థాయిలో ఒక యాడ్‌లో కూడా అతను నటించాడు. దీంతో అతడి అరంగేట్ర సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. కానీ ‘అఖిల్’ ఆ అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత అఖిల్ నటించిన రెండు సినిమాల సంగతీ తెలిసిందే. ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

మామూలుగా ఘనమైన వారసత్వంతో వచ్చిన హీరోలు సినిమా సినిమాకు రేంజ్, మార్కెట్, ఫాలోయింగ్ పెంచుకుంటూ పైకి ఎదిగే ప్రయత్నం చేస్తుంటారు. కానీ అఖిల్ విషయంలో దీన్ని భిన్నంగా జరిగింది. తొలి సినిమాకు ఉన్న క్రేజ్, హైప్ ఆ తర్వాతి సినిమాలకు లేకపోయింది. గ్రాఫ్ కిందికి పడుతూ వచ్చింది.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విషయానికి వచ్చేసరికి ఇది హిట్టయితే చాలు అనే పరిస్థితి ఉంది తప్ప అఖిల్ స్టార్ అవుతాడా, అతడి ఇమేజ్‌ పెరుగుతుందా అన్న చర్చే లేదసలు. ఆ సినిమాపై అంచనాలు కూడా తక్కువే ఉన్నాయి. ఐతే సురేందర్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్‌తో అఖిల్ తన తర్వాతి చిత్రం చేయబోతుండటంతో అక్కినేని అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. సోషల్ మీడియాలో చాలా కాలం తర్వాత వారి సందడి కనిపిస్తోంది.

అఖిల్‌ను మాస్ హీరోగా చూడాలన్న అక్కినేని ఆశలకు మళ్లీ రెక్కలొచ్చాయి. నాగచైతన్య ఫెయిలైన ఈ విషయంలో అఖిల్ సక్సెస్ అవుతాడన్న ఆశ మళ్లీ ఇప్పుడు వారిలో చిగురిస్తోంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో, మాస్‌ను మెప్పించడంలో సురేందర్ స్టైలే వేరు. కొంచెం ముందుగానే ఇలాంటి దర్శకుడు అఖిల్‌కు పడి ఉంటే అతడి కెరీర్ ఇలా ఉండేది కాదేమో.

ఐతే అయ్యిందేదో అయ్యింది.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో తొలి విజయాన్నందుకుని.. ఆ తర్వాత సురేందర్ మార్క్ మాస్ ఎంటర్టైనర్‌లో నటిస్తే అఖిల్ కెరీర్లో మార్పు వస్తుందని తాము కోరుకున్నట్లే అతను మాస్ హీరో అవుతాడని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.