ఓటీటీ మూవీకి సీక్వెల్!

కరోనా టైంలో కొందరు పేరున్న హీరోలు నటించిన సినిమాలు కూడా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీల్లో నేరుగా రిలీజయ్యాయి. తెలుగులో విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’, ‘దృశ్యం-2’, నాని ‘వి’, ‘టక్ జగదీష్’.. తమిళంలో సూర్య ‘ఆకాశమే నీ హద్దురా’ లాంటి చిత్రాలను ఈ కోవలో చెప్పుకోవచ్చు. వీటిలో కొన్ని చిత్రాలు ఓటీటీలో మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ కోవలో చెప్పుకోవాల్సిన మరో సినిమా.. మహాన్.

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ కలిసి నటించిన చిత్రమిది. ‘పిజ్జా’, ‘జిగర్ తండ’ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశాడు. విక్రమ్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్, ఆయన కొడుకు సూపర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంచి కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ నరేషన్‌తో ‘మహాన్’ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఐతే ‘మహాన్’ థియేటర్లలో రిలీజై ఉంటే ఎన్నో ఏళ్లుగా సరైన సక్సెస్ లేని విక్రమ్‌‌కు మంచి హిట్‌గా నిలిచేది అన్న అభిప్రాయం వ్యక్తమైంది. థియేటర్లలో చూడాల్సిన సినిమా.. ఇలా ఓటీటీకి పరిమితం అయిందే అని విక్రమ్ ఫ్యాన్స్ అప్పుడు చాలా ఫీలయ్యారు. ఐతే ‘మహాన్’ను మిస్సయినప్పటికీ.. దీని సీక్వెల్‌ను థియేటర్లలో చూసే అవకాశం వచ్చేలా కనిపిస్తోంది. నిన్ననే ‘మహాన్’ 2వ వార్షికోత్సవం జరుపుకుంది.

ఈ సందర్భంగా ‘మహాన్’ అవతారంలోకి మారిన విక్రమ్.. మహాన్-2 గురించి హింట్ ఇస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కూడా ‘మహాన్’ గురించి స్పెషల్‌గా మాట్లాడాడు. దీన్ని బట్టి సీక్వెల్ వచ్చే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. కార్తీక్.. ప్రస్తుతం కొత్తగా ఏ సినిమా కమిట్ కాలేదు. విక్రమ్ తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ‘మహాన్-2’నే మొదలుపెట్టేలా కనిపిస్తున్నాడు. విక్రమ్ మరోసారి మహాన్ పాత్రలో అదరగొడితే.. ఆయన తనయుడు కూడా మెరుపులు మెరిపిస్తే థియేటర్లలో విక్రమ్ ఫ్యాన్స్‌కు ఫీస్ట్ అవుతుందనడంలో సందేహం లేదు.