ట్రోలింగ్ మీద హరీష్ శంకర్ పంచులు

దర్శకుడు హరీష్ శంకర్ ఇవాళ ఆగ్రహం, ఆవేదన నిండిన స్వరంతో పంచులు కౌంటర్లు వేశారు. ఈగల్ సక్సెస్ మీట్ సందర్భంగా విచ్చేసిన ఆయన పలు అంశాల గురించి స్పష్టంగా మాట్లాడారు. తన ఫోటో పెట్టకుండా షాడో ఇమేజ్ వేసి స్టోరీలు రాసే కొన్ని మీడియా కథనాలను చూశానని, ఏదో గ్యాప్ వచ్చిందని, అయిదు సంవత్సరాలు సినిమా చేయలేదని ఏదేదో రాశారని, ఒకేసారి ఉస్తాద్ భగత్ సింగ్, మిస్టర్ బచ్చన్ చేస్తున్న తాను త్వరలోపెద్ద హీరోలతో మరో రెండు చిత్రాలు ప్లాన్ చేశానని, వాటికి సంబంధించిన ప్రకటనలు కూడా త్వరలోనే వస్తాయని నొక్కి మరీ చెప్పారు.

స్పీచులో ట్రోలింగ్ ప్రస్తావన వచ్చింది. ఇండస్ట్రీ రావాలని అనుకున్నప్పుడు అమ్మానాన్నాతో సహా బంధువులందరూ హరీష్ శంకర్ డైరెక్టర్ అవుతాడట వీడో పెద్ద మణిరత్నం మరి అంటూ ఎగతాళి చేసినవాళ్ళేనని కానీ విజయం సాధించి తానేంటో ఋజువు చేశానని, ఇలా ఎందరో ఎన్నో త్యాగాలు చేసి పరిశ్రమకు వస్తారని, అన్నింటికి తెగించే ఉన్నామని కాస్తంత ఆవేశంగానే మాట్లాడారు. ఈ సందర్భంగానే రేటింగులు, రివ్యూల మీద సైతం అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సినీ జర్నలిజం ఇండస్ట్రీలో భాగమే కాబట్టి ఇద్దరం చెరో ఒడ్డు మీద లేమనే వాస్తవాన్ని గుర్తించాలని కోరారు.

మొత్తానికి హరీష్ శంకర్ మాటలు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారుతున్నాయి. ఈగల్ తీసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లోనే ఆయన ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ చేస్తున్న సంగతి తెలిసిందే. రైడ్ రీమేక్ గా రూపొందుతున్న ఈ హీస్ట్ థ్రిల్లర్ వేసవిలోనే పూర్తి చేయబోతున్నారు. ఎన్నికలు అయ్యాక పవన్ కళ్యాణ్ డేట్స్ ని బట్టి ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాలన్స్ ని ఫినిష్ చేయాలి. చిరంజీవితో ఓ సినిమా ఓకే అయ్యిందనే లీక్ వచ్చింది కానీ అధికార ప్రకటన వచ్చేదాకా ఖరారుగా చెప్పలేం. చిరు పేరు తెలిసిపోయింది కాబట్టి లిస్టులో ఉన్న ఇంకో హీరో ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.