ఆదిపురుష్ సీతకు నాలుగో దెబ్బ

మహేష్ బాబు సరసన 1 నేనొక్కడినేతో టాలీవుడ్ కు పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తర్వాత నాగ చైతన్యతో చేసిన దోచేయ్ కూడా సక్సెస్ రుచిని ఇవ్వలేదు. దీంతో పూర్తిగా బాలీవుడ్ కే అంకితమైపోయింది. తిరిగి ఆదిపురుష్ లో ప్రభాస్ తో చేసే దాకా మళ్ళీ మనకు కనిపించలేదు. దాని ఫలితమేంటో చెప్పనక్కర్లేదు. ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా కృతికి అవకాశాలకు లోటు లేకుండా గడిచిపోయింది. గత ఏడాది గణపత్ లో టైగర్ శ్రోఫ్ సరసన చేస్తే పట్టుమని వారం ఆడకుండానే నిర్మాతకు చుక్కలు చూపించింది. వీటికన్నా ముందు అల వైకుంఠపురములో రీమేక్ షెహజాదా డిజాస్టర్.

కట్ చేస్తే నిన్న షాహిద్ కపూర్ తో నటించిన తేరి బాతోమే ఐసా ఉల్జా జియా రిలీజయ్యింది. రివ్యూలు మిశ్రమంగా వచ్చాయి. క్రిటిక్స్ పెదవి విరిచారు. పబ్లిక్ టాక్ కూడా యావరేజ్ దగ్గరే ఎక్కువ కనిపిస్తోంది. కబీర్ సింగ్ తర్వాత మార్కెట్ తిరిగి పుంజుకున్న షాహిద్ కు ఆ తర్వాత ఆ స్థాయి విజయం మళ్ళీ దక్కలేదు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ కాబట్టి ఖచ్చితంగా ఆడుతుందనే నమ్మకంతో ఈ సినిమా చేశాడు కానీ ఫలితం నిరాశపరిచేలా ఉంది. డంకీ, యానిమల్ తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు హిందీలో లేకపోవడంతో ఉత్తరాది వీకెండ్ బుకింగ్స్ పర్వాలేదనిపించేలా ఉన్నాయి.

ఈ లెక్కన కృతి సనన్ కు వరసగా నాలుగో దెబ్బ పడినట్టే. అందానికి లోటు లేకపోయినా, మిమి లాంటి చిత్రంతో జాతీయ అవార్డు సాధించినా ఇంకా పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున ఆదిపురుష్ సీతకు అది ఎప్పుడు దక్కుతుందో చెప్పడం కష్టమే. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ది క్రూ, దో పత్తి మీదే ఆశలన్నీ పెట్టుకుంది. తెలుగు నుంచి ఒకటి రెండు ఆఫర్లు వెళ్లాయని అంటున్నారు కానీ సౌత్ ఆఫర్లకు కృతి నో అంటోందట. అమిత్ జోషి-ఆరాధనా సా జంటగా దర్శకత్వం వహించిన తేరి బాతోమే ఐసా ఉల్జా జియా ప్రేమకథే అయినప్పటికీ సహనానికి పెద్ద పరీక్ష పెట్టే నెరేషన్ తో సాగుతుంది.