అల్లు బోయపాటి కాంబోలో కొత్త ట్విస్టు

ఇటీవలే నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ మీద దర్శకుడు బోయపాటి శీనుతో సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే హీరో ఎవరనే దాని మీద రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. సరైనోడు తర్వాత ఈ కమిట్ మెంట్ పెండింగ్ ఉంచేసిన బోయపాటి ఫైనల్ గా దాన్ని తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇది అల్లు అర్జున్ తో మాత్రం కాదు. ఎందుకంటే తనకు పుష్ప 2 కాకుండా మరో మూడు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. వాటిని కాదని అర్జెంట్ గా బోయపాటి శీనుతో జట్టు కట్టేంత సీన్ లేదు. బాలకృష్ణ పేరు కూడా బలంగా వినిపిస్తోంది.

అఖండ 2 కథ సిద్ధంగా ఉందని ఒక వర్గం, లేదు 14 రీల్స్ నుంచి ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్న బాలయ్య దాన్ని బోయపాటితో చేయించేలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఇంకోవైపు ఏవేవో ప్రచారాలు జరుగుతున్నాయి. కొత్త ట్విస్టు ఏంటంటే ఇప్పుడీ సీన్ లోకి విజయ్ దేవరకొండ ఎంటరయ్యాడట. ఫ్యామిలీ స్టార్ దర్శకుడు పరశురామ్ ని దిల్ రాజుకి లాక్ చేయించడం కోసం వేరే సినిమా చేస్తానని రౌడీ హీరో గతంలో మాటిచ్చాడట. ఇప్పుడు బోయపాటి శీను రాసుకున్న స్టోరీ అతని ఇమేజ్ కి సరిపోయేలా ఉండటంతో ఈ కలయికని సాధ్యం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి.

అధికారికంగా చెప్పేవరకు ఇదంతా సస్పెన్స్ అనే చెప్పాలి. బన్నీ గురించి క్లారిటీ వచ్చేసింది కాబట్టి బాలకృష్ణ లేదా విజయ్ దేవరకొండ ఈ ఇద్దరిలో ఒకరితోనే బోయపాటి శీను మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. మధ్యలో తమిళ హీరో సూర్య పేరు వినిపించింది కానీ అది నిజం కాదట. ఈ క్యాలికులేషన్ల వల్లే హీరో తాలూకు అనౌన్స్ మెంట్ లేట్ అవుతోంది. ఈ త్రిముఖ చిక్కు రావడానికి కారణం ఒకటే. బాలకృష్ణ, బోయపాటి, విజయ్ దేవరకొండ ముగ్గురూ గీతా ఆర్ట్స్ కి ఓ సినిమా బాకీ ఉండటమే. మరి ఫైనల్ గా ఏం ఖరారవుతుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడక తప్పదు.